లింకులతో టోకరా..!
– సైబర్ నేరగాళ్ల కొత్త టెక్నిక్ ఇదే
– బాధితులు ఎలా మోసపోతున్నారంటే
– తస్మాత్ జాగ్రత్త అంటున్న నిపుణులు
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: అరచేతి ప్రపంచంలో సైబర్ నేరగాళ్ల సామ్రాజ్యం విస్తరించి పోతోంది. రోజు రోజుకు విభిన్న పంథాలతో మోసాలకు పాల్పడుతున్నారు. ఈ మధ్య కాలంలో ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్న వారందరికి లింకులు పంపించి.. టోకరా వేస్తున్నారు. వందలు, వేలు, లక్షలు అందినకాడికి క్షణాల్లో దోచేస్తున్నారు. మీరు కరెంట్ బిల్లు కట్టలేదా? అయితే, బిల్లు కట్టాలంటూ ఎవరైనా ఫోన్ చేస్తే నమ్మకండి. పొరపాటున నమ్మారో అంతే సంగతులు! మీ అకౌంట్లో డబ్బు మొత్తం గల్లంతవడం ఖాయం. సరిగ్గా ఇలాంటి కొత్త తరహా మోసానికి కామారెడ్డి జిల్లాలో ఓ బాధితుడు బలైపోయాడు. కామారెడ్డి మండలం దేవునిపల్లి గ్రామస్తుడైన రాజేశ్వర్కు ఫోన్చేసిన కేటుగాళ్లు.. మూడు నెలల కరెంట్ బిల్లు పెండింగ్ ఉందంటూ బెదిరించారు. వెంటనే చెల్లించకపోతే కరెంట్ కట్ చేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. బాధితులు మెత్తపడడంతో దానిని అసరాగా చేసుకున్న సైబర్ నేరగాళ్లు వెంటనే ఓ లింక్ పంపి ఆన్లైన్లో బిల్లు చెల్లించాలని చెప్పారు. దీంతో రాజేశ్వర్ దాన్ని ఓపెన్ చేశాడు.. క్షణాల్లోనే అతని అకౌంట్లో నుంచి 49వేల రూపాయలు డెబిట్ అయినట్టు మొబైల్కి మెసేజ్ ఇచ్చింది. దాంతో, మోసపోయాయని గ్రహించిన బాధితుడు రాజేశ్వర్.. దేవునిపల్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రాజేశ్వర్కే కాదు ఇప్పుడో.. మరికాసేపట్లోనో.. నేడో, రేపో మీకు కూడ సైబర్ నేరగాళ్లు లింకులు పంపొచ్చు. కరెంట్ బిల్లే అని కుండా గ్యాస్ ధరలను తగ్గించుకోవచ్చని, ఆధార్ ఆప్ డేట్ చేసుకోండని, ల్యాటరీ తగలిందని పలు విధమైన లింకులు పంపవచ్చు. లేదా స్థానిక లైన్మెన్, ఆఫీస్ బాయ్.. ఎంప్లాయ్ వస్తాడు అని ళ ఎవరైనా ఫోన్ చేశారంటే మోసగాళ్లే అయ్యుంటారు. ఇలాంటి వాటిని అనుమానించాల్సిందే అని, తస్మాత్ జాగ్రత్త పడాలని నిపుణులు, పోలీసులు హెచ్చరిస్తున్నారు.

