వరికి ముందు పంటమార్పు చేయాలి
– యామాజన్య పద్ధతులతో లాభదాయకం
– డాట్ సెంటర్ శాస్త్ర వేత్త డా. శేఖర్
తాండూరు, దర్శిని ప్రతినిధి : రైతులు వానాకాలం వరి పంట సాగుకు ముందు పంట మార్పు పద్దతిని పాటించాలని డాట్ సెంటర్ శాస్త్ర వేత్త, కోఆర్డినేటర్ డా. శేఖర్ అన్నారు. మంగళవారం తాండూరు నియోజకవర్గం యాలాల మండలంలోని కిష్టాపూర్, హాజీపూర్ గ్రామాల్లో ఆయన వరి పంటల సాగును క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. ఆయా గ్రామాల్లో రైతులు సాగు చేస్తున్న రుద్రూర్, వరంగల్ చిరు సంచుల దశలోని వరి సాగు రకాలను డా.శేఖర్ పరిశీలించారు. రైతులు సాగు చేస్తున్న ఈ రకాల పంటలపై ఆరా తీశారు. రైతులు సాగులో చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులను వివరించారు. ఈ సందర్భంగా ఆయన వాట్లాడుతూ రైతులు వరి తరువాత వరి సాగు చేస్తే భూసారం తగ్గిపోతుందని, కావున రైతులు వరి సాగులో వానాకాలానికి ముందు పెసర పంటలను సాగు చేయాలని సూచించారు. ఇలా చేయడం వల్ల భూసారం పెరిగి సాగు లాభదాయకంగా మారుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు రవీందర్, వీరప్ప, ఒప్వరాజు తదితరులు పాల్గొన్నారు.

