తెలంగాణలో మరో దిశ సంఘటన
– మహిళ హత్య, పెట్రోల్ పోసి నిప్పు
– శంషాబాద్ పరిధిలో వెలుగులోకి
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలో మరో దిశ సంఘటన చోటు చేసుకుంది. రాష్ట్రంలోని శంషాబాద్ పరిధిలో వెలుగులోకి వచ్చిన ఈసంఘటన కలకలం రేపింది. ఓ మహిళపై గుర్తు తెలియని దుండగులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. శంషాబాద్ సైబరాబాద్ కమిషనరేట్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనివాస కాలనీలో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. మహిళను హత్య చేసి పెట్రోల్ పోసి నిప్పంటించారు గుర్తు తెలియని వ్యక్తులు. స్థానిక సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. మహిళను హత్య చేసి ఇక్కడ పడేసి ఉంటారని అనుమానిస్తున్నారు. మృతి చెందిన మహిళ ఎవరు? మహిళను ఎవరు చంపారు? ఎందుకు చంపారు? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సంచలనం రేపిన దిశ రేప్ అండ్ మర్డర్ తర్వాత ఇది రెండవ కేసు కావడం గమనార్హం. అసలు ఆ మహిళ ఎవరు? ముందుగానే చంపేసి అక్కడకు తీసుకొచ్చి తగులబెట్టారా? వంటి అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ దర్యాప్తులో సీసీ టీవీ ఫుటేజ్ కీలకం కానుంది. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరిని అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. నాలుగు ప్రత్యేక బృందాలు ఈ కేసు విషయమై రంగంలోకి దిగాయి ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇది కూడా చదవండి…

