స్కూల్ స్టూడెంట్స్‌కు సూపర్ స్కీం..!

కెరీర్ జాతీయం తెలంగాణ మహబూబ్ నగర్ రంగారెడ్డి లైఫ్-స్టైల్ వికారాబాద్ హైదరాబాద్

స్కూల్ స్టూడెంట్స్‌కు సూపర్ స్కీం..!
– ‘తపాలాశాఖ’ స్కాలర్‌షిప్‌ ద్వారా ఏటా రూ.6 వేలు
– ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..?
దర్శిని ప్రతినిధి: స్కూల్ విద్యార్థుల కోసం కేంద్రం సూపర్ స్కీంను అమలు చేస్తోంది. పోస్టాఫీసులో దీన్‌ దయాళ్‌ స్పర్శ్‌ యోజన స్కాలర్‌ ద్వారా రూ. 6వేల సాయంను అందిస్తోంది. ఆరో తరగతి నుంచి పదో తరగతి విద్యార్థులకు స్కాలర్‌ షిప్‌ అమలు కోసం పోటీ పరీక్షలు నిర్వహిస్తోంది. తపాలా బిళ్లల సేకరణ, అధ్యయనం (ఫిలాటలీ) వల్ల కలిగే ప్రయోజనాలను వివరించేందుకు ప్రతీ ఏటా తపాలాశాఖ దీన్‌ దయాళ్‌ స్పర్శ్‌ యోజన ఈ పోటీలను నిర్వహిస్తోంది. ఈ పోటీలో ఎంపికైతే ఎంపికైతే ఏటా రూ.6 వేల స్కాలర్‌షిప్‌ అందిస్తారు. ఇందుకు దరఖాస్తు చేసుకునేందుకు విద్యార్థులు సెప్టెంబర్‌ 20వ తేదీలోపు తమ పాఠశాల హెచ్‌ఎం పేరు మీద దరఖాస్తులు పంపవల్సి ఉంటుంది.

ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చంటే..
సమీపంలోని తపాలాశాఖలో రూ.200 చెల్లించి పోటీ పరీక్ష రాసే విద్యార్థి పేరుతో గానీ, పాఠశాల హెచ్‌ఎంల పేరుతోగానీ ఫిలాటలీ ఖాతా/ఫిలాటలీ క్లబ్‌ అకౌంట్‌ తెరవాలి. ఇలా అకౌంట్‌ ఓపెన్‌ చెయ్యగానే రూ.180 విలువ చేసే తపాలా బిళ్లలు ఇస్తారు. ఇవి పోటీ పరీక్షలు రాసేందుకు విద్యార్ధులకు ఉపయోగపడతాయి. ఏయే తేదీల్లో పరీక్షలు ఉంటాయనే విషయాన్ని తపాలా అధికారులు ఆయా పాఠశాల హెచ్‌ఎంలకు తెలియజేస్తారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఆరో తరగతి నుంచి తొమ్మదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఎవరైనా దీన్‌ దయాళ్‌ స్పర్శ్‌ యోజన పోటీ పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు.

అయితే ఒక్కో తరగతి నుంచి పది మంది విద్యార్థులను మాత్రమే ఎంపిక చేస్తారు. నాలుగు తరగతులకు సంబంధించి మొత్తం 40 మందిని ఎంపిక చేస్తారు. ఇలా ఎంపిక చేసిన వారికి ప్రతినెలా రూ.500 చొప్పున ఏడాదికి రూ.6 వేల స్కాలర్‌షిప్‌ అందిస్తారు. ఈ స్కాలర్‌షిప్‌ పొందేందుకు విద్యార్థుల పేరు, వారి తల్లిదండ్రుల పేరుతో తపాలాశాఖలో జాయింట్‌ సేవింగ్స్‌ అకౌంట్‌ను తెరవాలి. తపాలాశాఖ ఉపకార వేతనం మొత్తాన్ని మూడు నెలలకు ఒకసారి విద్యార్థి ఖాతాలో వేస్తుంది.

ఎలా ఎంపిక చేస్తారంటే..
రెండు దశల్లో దీన్‌ దయాళ్‌ స్పర్శ్‌ యోజన పోటీ పరీక్ష ఎంపిక ప్రక్రియ ఉంటుంది. స్టేజ్‌ 1లో స్క్రీనింగ్‌ పరీక్ష, స్టేజ్‌ 2లో ప్రాజెక్టు వర్క్‌ ఉంటుంది. జనరల్‌ నాలెడ్జ్‌, స్టాంపులు, హిస్టరీ, స్పోర్ట్స్‌, సైన్స్‌, కరెంట్‌ అఫైర్స్‌ నుంచి 50 మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలు స్క్రీనింగ్‌ పరీక్షలో వస్తాయి. స్క్రీనింగ్‌ టెస్ట్‌లో ఉత్తీర్ణత పొందిన విద్యార్ధులను మాత్రమే స్టేజ్‌ 2 ప్రాజెక్టు వర్కుకు అనుమతిస్తారు. ప్రాజెక్ట్‌ వర్క్‌లో జంతువులు, పక్షులు, ప్రదేశాలు, పూలు, సంగీతం వంటి విభాగాల్లో ఏదో ఒక టాపిక్‌ ఎంచుకొని ఇంటి వద్దనే 16 స్టాంపులతో 4 నుంచి 5 పేజీలకు మించకుండా ప్రాజెక్టు వర్క్‌ పూర్తిచేయాలి. ప్రాజెక్ట్‌ వర్క్‌ పూర్తయిన తర్వాత సంబంధిత తపాలాశాఖ రీజనల్‌ ఆఫీస్‌ అడ్రస్‌కు పోస్టు ద్వారా సమర్పించాలి.

ఇదికూడా చదవండి…

పేద విద్యార్థుల సేవలో..!