కొప్పుల హరీశ్వర్ రెడ్డి అస్తమయం
– అనారోగ్యంతో కన్నుమూత
– సానుభూతి ప్రకటించిన సీఎం కేసీఆర్
పరిగి, దర్శిని ప్రతినిధి: వికారాబాద్ జిల్లా పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్వర్రెడ్డికి పితృవియోగం కలిగింది. బీఆర్ఎస్ సీనీయర్ నాయకులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప సభాపతి కొప్పుల హరీశ్వర్రెడ్డి (78) కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా ఆనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. హరీశ్వర్రెడ్డి తెలుగుదేశం పార్టీ పొలిట్బ్యూరో సభ్యుడిగా, పరిగి నియోజకవర్గం నుంచి పలుమార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. తెలంగాణ ఆవిర్భావం తరువాత 2014లో భారాసలో చేరారు. ఆయన కుమారుడు కొప్పుల మహేశ్వర్ రెడ్డి ప్రస్తుతం పరిగి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. హరీశ్వర్ రెడ్డి మరణంలో వారి కుటుంబంలో విషాదం నిండుకుంది. మరోవైపు హరీశ్వర్రెడ్డి కన్నుమూయడం పట్ల సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. ప్రజలకు హరీశ్వర్రెడ్డి చేసిన సేవలను ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ గుర్తుచేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సీఎం కేసీఆర్తో పాటు విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, గనులు, భూగర్భవనరుల శాఖ మంత్రి మహేందర్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్, కోడంగల్ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి తదితరులు కూడా సానుభూతి ప్రకటించారు.

ఇదికూడా చదవండి…

