గణేష్ ఉత్సవ సమితిలకు పోలీసుల షాక్..!
– డీజేలు పెట్టినందుకు నాలుగు కేసులు
– న్యూసెన్స్ చేసిన వారిపై మరో రెండు కేసులు
– వెల్లడించిన పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి: ఇటీవల జరిగిన వినాయక నిమజ్జన ఉత్సవాలలో నిబంధనలు పాటించని గణేష్ ఉత్సవ సమితిలకు తాండూరు పట్టణ పోలీసులు షాక్ ఇచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా డీజేలు పెట్టడంతో పాటు నిమజ్జన ఉత్సవంలో న్యూసెన్స్ చేయడం పట్ల మొత్తం 6 కేసులను నమోదు చేశారు. ఆదివారం ఓ ప్రకటనలో పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఈనెల 22 జరిగిన వినాయక నిమజ్జనంలో పోలీసు నిబంధనలకు విరుద్దంగా డీజేలు పెట్టిన నిర్వహకులు, యజమానులపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఇందులో పట్టణానికి చెందిన శ్రీ చంద్ర వినాయక ఉత్సవ సమితి, డీజే ఓనర్(డీసీఎం ఏపీ25క్యూఓ 1100), మరో నిర్వహకులు ప్రశాంత్, డీజే ఓనర్ (టీఎస్ యూడీ 4184), మరో నిర్వహకులు భానుతేజ, డీజే ఓనర్ (టీఎస్ 34 టీవీ 9695), గుమాస్తానగర్లోని 214 మండపం నిర్వహకులు, డీజే ఓనర్(టీఎస్ 12 యూడీ 7837)లపై కేసులు నమోదు చేయడం జరిగిందని తెలిపారు.
అదేవిధంగా నిమజ్జనం రోజున తాండూరు మున్సిపల్ పరిధి పాత తాండూరుకు చెందిన రాజాసింగ్ యూత్, వినాయక యూత్ ఉత్సవ సమితిలు ఊరేగింపులో మేము ముందు అంటే మేమూ ముందంటూ ఘర్షణకు పాల్పడడంతో ఇరువర్గాలపై కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. మరోవైపు అదేరోజు భద్రేశ్వర చౌరస్తా వద్ద ఊరేగింపులో పాత తాండూరుకు చెందిన చింతామణి పట్నం వారి గణేష్ ఉత్సవ సమితి వారు సేజీ ముందు 5 నిమిషాలు సమయం ఇచ్చినా ఇంకా సమయం ఇవ్వాలని రభస చేశారు. ఈ క్రమంలో నిర్వహకులు, వార్డు కౌన్సిలర్ భర్త పోలీసులతో వాగ్వివాదానికి దిగి.. విధులకు ఆటంకం కలిగించారు. దీంతో వారిపై కూడా కేసులు నమోదు చేయడం జరిగిందని పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి తెలిపారు.
ఇదికూడా చదవండి…

