కాంగ్రెస్ వచ్చేది లేదు సచ్చేది లేదు..!
– 50 ఏండ్ల పాలనలో తెలంగాణకు అన్యాయం
– ధరణి ఎత్తేస్తే మళ్లీ దళారీ రాజ్యం
– భూమాత తేచ్చేది మేత కోసమే
– తెలంగాణ కోసం పుట్టిన బీఆర్ఎస్ను గెలిపించాలి
– తాండూరులో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని గెలిపించండి
– సంక్షేమాన్ని ఆగకుండా అమలు చేస్తాం
– తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్
– తాండూరులో ప్రజా ఆశీర్వాద సభ సక్సెస్
హైదరాబాద్/తాండూరు, దర్శిని ప్రతినిధి : 50 ఏండ్లు పాలించి తెలంగాణను అన్యాయానికి గురి చేసిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేది లేదు.. సచ్చేది లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. బుధవారం వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పట్టణంలోని విలియమూన్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన వేదిక నుంచి సీఎం కేసీఆర్ ప్రసంగించారు.
ఓ వైపు బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి, సంక్షేమాన్ని వివరిస్తూనే కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేశారు. ఆ పార్టీలోని మాజీ టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డిలు రైతు బంధు ఎత్తేయాలని, 24 గంటల విద్యుత్ అవసరం లేదని విమర్శలు చేశారని అన్నారు. వాళ్లు అధికారంలోకి వస్తే దరణి ఎత్తివేసి భూమాతను ప్రవేశ పెట్టాలని చూస్తున్నారని అన్నారు. ధరణిని ఎత్తివేస్తే మళ్లీ దళారీ వ్యవస్థ ఏర్పడుతుందన్నారు. మళ్లీ పట్వారీలు, పాత కథనే వస్తది. మళ్లీ దళారి రాజ్యమే వస్తది. కాంగ్రెస్ అంటేనే దళారీ, పైరవీకారుల రాజ్యం. మన భూములు మనకు కాకుండా చేసే కుట్ర జరుగుతుంది. చాలా కష్టపడి ధరణి తెచ్చాం. కరెంట్ తెచ్చాం. అవన్నీ కూడా తీసేస్తాం అంటున్నారు. కాబట్టి ఆలోచించి ఓటు వేయాలని కేసీఆర్ కోరారు. అదేవిధంగా ధరణి స్ధానంలో భూమాత పెట్టాలని చూస్తున్నారని, అది భూమాత కాదు భూమేత అన్నట్లుగా ఉంటుందని విమర్శించారు.
సంక్షేమంతో ముందుకు
ఈ పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఏం జరిగింది. 50 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో ఏం జరిగిందో పోల్చిచూడాలి. ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్. తెలంగాణ వచ్చిన కొత్తలో కరెంట్ లేదు, సాగు, మంచినీళ్లు లేవు. ప్రజలంతా బతుకపోవుడు. అర్థరాత్రి కరెంట్ కోసం పోయి తాండూరులో 40 మంది రైతులు షాకులతో, పాములు కరిచి చనిపోయారు. ఇవన్నీ మీరు ఆలోచించాలి. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని ఆర్థికనిపుణులతో చర్చించి ఒక లైన్ తీసుకున్నాం.
పేదల సంక్షేమాన్ని ముందు తీసుకున్నాం. రూ. 200 ఉన్న పెన్షన్ను రూ. 2 వేలు చేశాం. కంటి వెలుగు ద్వారా కండ్లద్దాలు పంపిణీ చేశారు. గర్భిణుల కోసం కేసీఆర్ కిట్, అమ్మ ఒడి వాహనాలు అందుబాటులోకి తెచ్చాం. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి కార్యక్రమాలు అమలు చేశాం అని కేసీఆర్ తెలిపారు. కాంగ్రెస్ పాలనలో తాండూరులో నీసం మంచినీళ్లు, సాగునీళ్లు ఇవ్వలేదని, తాండూరు ప్రజలు కాగ్నా నది వద్ద గుంతలు తీసి వడకట్టుకొని నీళ్లు తాగే పరిస్థితులు ఉండేవన్నారు. ఈ రోజు మిషన్ భగీరథతో ప్రతి తండాలో, చిన్న ఊరులో కూడా పరిశుద్ధమైన నీరును సరఫరా చేస్తోంది. మంచినీళ్లు కూడా ఇవ్వలేదు కాంగ్రెస్ పాలనలో పదేండ్ల కాలంలో మారుమూల తండాలకు మంచి నీళ్లు తెచ్చి ఇచ్చాం అని కేసీఆర్ తెలిపారు. సంక్షేమం తర్వాత వ్యవసాయ రంగం తీసుకున్నాం. వ్యవసాయం బాగుంటే, రైతులు చల్లగా ఉంటే దేశం కూడా బాగుంటది. ప్రాజెక్టుల కింద నీళ్లు పారుతే ఇతర రాష్ట్రాల్లో పన్నులు వసూళ్లు చేస్తరు. మేం నీటి తిరువా రద్దు చేశాం. మేలైన విద్యుత్ 24 గంటలు ఫ్రీ ఇస్తున్నాం. రైతుబంధును పుట్టించిందే కేసీఆర్. అదృష్టం బాగాలేక రైతు ఎవరైనా చనిపోతే దినవారం లోపే 5 లక్షల బీమా ఇస్తున్నాం. 7500కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొంటున్నాం. ప్రభుత్వానికి నష్టం వచ్చినప్పటికీ రైతులు బాగుండాలని మద్ధతు ధరకు కొంటున్నాం. ఆ డబ్బులు కూడా మీ బ్యాంకు ఖాతాలో వేస్తున్నామని కేసీఆర్ గుర్తు చేశారు.
నిజాయిపరుడు రోహిత్ రెడ్డి.. 100శాతం హామిలు నెరవేరుస్తాం
తాండూరు బీఆర్ఎస్ అభ్యర్థి పైలట్ రోహిత్ రెడ్డి నిజాయితీపరుడు.. ఆయన కోరిన కోరికలన్నీ తప్పకుండా నెరవేర్చి, ఈ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. బీజేపీ వాళ్లు వచ్చి మన ప్రభుత్వాన్ని కూలగొట్టాలని కుట్ర చేస్తే వాళ్లను పట్టించి జైల్లో వేయించారు. బ్రహ్మాండమైన పని చేసిండు. నిజాయితీకి నిలబడ్డాడు. ఆయన అడిగింది ఏది కాదనకుండా మంజూరు చేస్తున్నాను.

ఆయన వ్యక్తిగతంగా ఏది అడగలేదు. రేపు రోహిత్ రెడ్డి గెలిస్తే రైతుబంధు తప్పకుండా ఉంటది.. ఉండుడే కాదు. 10 వేలనుంచి 16 వేలకు పోతది. 24 గంటల కరెంట్ ఉంటది రోహిత్ రెడ్డి గెలిస్తేనే లేదంటే కరెంట్ ఆగమైపోతది. కాబట్టి మీరు రోహిత్కు ఓటేయాలి. కత్తి ఒకరికి ఇచ్చియుద్ధం ఇంకొకరిని చేయమంటే ధర్మం కాదు కదా..? రైతుల పక్షాన, ప్రజల పక్షాన ఉండే వారి చేతిలో కత్తి పెడితేనే వాళ్లు మిమ్మల్ని కాపాడుతారు. అదేవిధంగా జినుగుర్తిలో ఇండస్ట్రీయల్ పార్కు కావాలని, లారీలు పట్టణంలో ఎక్కడంటే నిలబడుతున్నాయని చెప్పారు. తప్పకుండా పాలిటెక్నిక్ కాలేజీతో పాటు మిగతావి కూడా ఇచ్చేద్దాం. తప్పకుండా మంజూరు చేస్తాను అవేమీ గొంతెమ్మ కోరికలు కావు. ఢిల్లీ నుంచి తెచ్చేటివి కావు. హైదరాబాద్లో చేసే పని కాబ్టటి నూటికి నూరు శాతం నెరవేరుస్తాను అని కేసీఆర్ హామీ ఇచ్చారు.

మరోవైపు సీఎం కేసీఆర్ మహేందర్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈసారి రోహిత్ రెడ్డికి టికెట్ ఇద్దామంటే ఆయన కూడా పెద్ద మనసు చేసుకుని అంగీకరించారు. ఆయన ఆశీస్సులు కూడా మనకు ఉన్నాయి. రోహిత్ రెడ్డి నిజాయితీకి నిలబడ్డ మనిషి. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరి కేకే రావు, మధుసూదన్ చారి, ఎంపీ రంజిత్ రెడ్డి, కాసాని జ్ఞానేశ్వర్ రావు, సీనీయర్ నాయకులు పర్యాద కృష్ణమూర్తి, రాష్ట్ర నాయకులు కరణం పురుషోత్తంరావు, జెడ్పీ వైస్ చైర్మన్ బైండ్ల విజయ్ కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్, మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, వైస్ చైర్ పర్సన్ దీపా నర్సింలు, మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ వెంకటయ్య, ఎంపీపీలు బాలేశ్వర్ గుప్త, అనురాధ, జెడ్పీటీసీలు గౌడి మంజుల, సంధ్యారాణి, మార్కెట్ కమిటి చైర్మన్ పర్సన్ వీణ శ్రీనివాస్ చారి, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అఫ్పూ(నయూం), ప్రజా ప్రతినిధులు, కౌన్సిలర్లు, నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి…

