తెలంగాణ-కర్ణాటక మద్య రాకపోకలకు బ్రేక్..!
– జాతీయ రహదారిపై 45 రోజుల పాటు ఆంక్షలు
– ప్రకటించిన రాయచూర్ కలెక్టర్
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : కర్ణాటక లోని రాయచూరు నుంచి తెలంగాణలోని హైదరాబాద్కు రాకపోకలకు బ్రేక్ విధిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. నారాయణపేట జిల్లా కృష్ణ మండలం రాష్ట్ర సరిహద్దులో కృష్ణా నదిపై నిర్మించిన కృష్ణ బ్రిడ్జిపై నుంచి రాకపోకలను నిలిపివేయడం పట్ల రాయచూర్ జిల్లా కలెక్టర్ ప్రకటన జారీ చేశారు. కృష్ణ బ్రిడ్జిపై వెళ్తున్న జాతీయ రహదారి-167 మరమ్మత్తులు చేసేందుకు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దీంతో జనవరి 17వ తేదీన ఉదయం 5 గంటల నుండి 45రోజుల పాటు వాహనాల రాకపోకలు నిలిపివేస్తున్నట్లు రాయచూర్ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. కర్ణాటక లోని రాయచూరు నుంచి తెలంగాణలోని హైదరాబాద్కు రాకపోకలు సాగించే వాహనాదారులు ఆంక్షలను గమనించాలని కోరారు.
ప్రత్యామ్నాయమార్గాలివే..
ఇక కృష్ణ వంతెన ను కర్ణాటక ప్రభుత్వం మరమ్మత్తులు చేస్తున్న నేపథ్యంలో NH-167 రహదారిపై వెళ్లే వాహనాదాల కోసం తెలంగాణ పోలీసులు ప్రత్యామ్నాయ మార్గాలపై ఫోకస్ పెట్టారు. రాయచూర్ కి వెళ్ళే వారు మరికల్ సబ్ స్టేషన్ నుండి చిత్తనూరు, అమరచింత జూరాల డ్యాం, గద్వాల్ మీదుగా కేటీ దొడ్డి రాయచూర్ కు డైవర్షన్ చేశారు. కృష్ణా, మక్తల్, మరికల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనదారులకు అవగాహన నిమిత్తం ఫ్లెక్సీలను ఏర్పాటు చేయనున్నారు.
ఈ ప్రత్యేకతలేంటి అంటే..?
నిజాం నవాబుల పరిపాలన సమయంలో కృష్ణా నదిపై కర్ణాటక – తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రయాణ సౌకర్యం మెరుగుపరిచేందుకు బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. 1933లో ప్రారంభమై 1943 మధ్యకాలంలో ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయింది. ఈ బ్రిడ్జి నిర్మాణానికి నాటి నిజాం నవాబులు రూ. 13,28,500 వెచ్చించారు. కృష్ణా నదిపై 2,488 ఫీట్ల పొడవుతో 20 ఫీట్ల వెడల్పుతో 62 ఫీట్ల ఎత్తులో ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేశారు. ఈ బ్రిడ్జి నిర్మాణానికి మహమ్మద్ హమీద్ మీర్జా చీఫ్ ఇంజనీర్ గా యూసుఫ్, ఫరహతుల్ల ఇంజనీర్లుగా వ్యవహరించారు.
ఇదికూడా చదవండి…

