ఇసుక మాఫియా.. మాయ..!
– ప్రభుత్వ ఇసుకను పక్కదారి
– అనుమతులతో కనికట్టు
– నిబంధనలకు విరుద్దంగా రవాణా
– ఫలించని అధికారుల చర్యలు
తాండూరు, దర్శని ప్రతినిధి : వికారాబాద్ జిల్లాలోని ఇసుక మాఫీయా అధికారులను మాయ చేస్తోంది. పేదల కోసం ఇటీవలే ప్రభుత్వం కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఇండ్లు నిర్మించుకునే యజమానులు ప్రభుత్వానికి రూ. 600ల డీడీ చెల్లిస్తే ఒక ట్రాక్టర్ ఇసుక తరలించేందుకు అనుమతులు కల్పించారు. తాండూరు నియోజకవర్గంలోని పాత తాండూరు, మండలంలోని ఖాంజాపూర్, పెద్దేముల్ మండలం, బషీరాబాద్ మండలాల్లో ఇసుక లభ్యత కేంద్రాలను కూడా గుర్తించారు. నిబంధనల ప్రకారం.. డీడీలు చెల్లించిన వారికి తహీసీల్దార్ల పేరుతో అనుమతులు ఇచ్చేందుకు నిర్ణయించారు. ఈ మేరకు తాండూరు మండలంలో ఖాంజాపూర్ కాగ్నా వాగు నుంచి మంగళవారం ఇసుక తరలింపులు చేపట్టారు.
తరలింపులో కనికట్టు
ప్రభుత్వ విధానాన్ని అసరా చేసుకుని తాండూరులోని ఇసుక మాఫీయా కనికట్టుకు పాల్పడింది. పట్టణంలో నిర్మాణంలో ఉన్న, నిర్మించేందుకు ప్రయత్నాల్లో ఉన్న వారి వివరాలను సేకరించి వారి పేర్లతో తహసీల్దార్ కార్యాలయాల్లో అనుమతులు పొందినట్లు తెలుస్తోంది. ఈ రీతిలో అయిన అనుమతులు పొంది వాళ్లకే ఇసుక తరలించారా అంటే అదికూడా లేదు. అనుమతులు పొందింది ఒక చోటుకు అయితే తరలించేది మరోచోటుకు. పట్టణంలోని విజ్ఞానపురి కాలనీలో ఓ ట్రాక్టర్ ఇసుక డంపు చేయాల్సి ఉండగా పట్టణంలోని మల్ రెడ్డిపల్లి హనుమాన్ ఫంక్షన్ హాల్ వద్ద ఇసుక డంపు చేసినట్లు ఆధారాలు ఉన్నాయి. ఇలా ఇసుక మాఫియా కనికట్టుకు పాల్పడుతోంది.
ఫలించని అధికారుల చర్యలు
తాండూరు నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు అధికారులు తీసుకవచ్చిన చర్యలు ఫలించడం లేదని పలువురు వాపోతున్నారు. ప్రభుత్వం ఎన్ని నిబంధనలు తీసుకవచ్చినా ఇసుకాసురులు అందులోని లోపాలను, ఇతర విధానాలను పాటిస్తూ యధేచ్చగా ఇసుక రవాణా సాగిస్తున్నారని విమర్శిస్తున్నారు. ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేయాలంటే.. ఇసుక తరలించే ట్రాక్టర్లకు జీపీఎస్ ట్రాక్ వ్యవస్థను అమలు చేయాలని అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
రెండు ఇసుక ట్రాక్టర్ల సీజ్
తాండూరులో అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను అధికారులు సీజ్ చేశారు. మంగళవారం నుంచి అందుబాటులోకి వచ్చిన ప్రభుత్వ ఇసుక రవాణా విధానంపై అధికారులు దృష్టిసారించారు. ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకే ఇసుక తరలింపుకు అనుమతులు ఉండగా పట్టణంలోని పాత తాండూరు నుంచి విరుద్దంగా ఇసుక తరలిస్తున్నట్లు తాండూరు మైన్స్ ఏడీ జాకబ్కు స్థానికులు సమాచారం అందించారు. ఈ మేరకు మైన్స్ ఏడీ జాకబ్ దాడులు నిర్వహించి రెండు ట్రాక్టర్లను స్వాదీనం చేసుకుని పట్టణ పోలీసులకు అప్పగించారు. దీంతో అధికారులు ట్రాక్టర్లను సీజ్ చేశారు.
ఇదికూడా చదవండి…

