మందు బాబులు జరభద్రం..!
– తాగి రొడ్డెక్కితే కేసులు తప్పవు
– పట్టణంలో తనిఖీలు చేస్తున్న పోలీసులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: సుక్కెసుకుని రోడ్డుపైకి వచ్చే మందుబాబులకు వారి మత్తును దించేసే వార్త ఇది. ఇకపై తాండూరు పట్టణ రోడ్లపై మద్యం సేవించి వాహనాలు నడిపితే పోలీసుల కేసులు ఎదుర్కొవాల్సిందే. మందేసుకుని చక్కర్లు కొట్టే మత్తుగాళ్లపై తాండూరు పట్టణ పోలీసులు సరిగ్గా సాయంత్రం వేళల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల ప్రయోగాన్ని సందిస్తున్నారు. మందు సేవించి రొడ్డెక్కిన వాహనదారుల నషాను దించేస్తూ.. కేసులు నమోదు చేస్తున్నారు. తాండూరు పట్టణ పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఈనెల మొదటి నుంచి తనిఖీలు చేస్తున్నారు. ఆదివారం తాండూరు పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి ఆదేశాల మేరకు ఎస్ఐ గిరి తన బృందంతో కలిసి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. పట్టణంలోని శివాజీ చౌరస్తా వద్ద ఎస్ఐ గిరి తనిఖీలు కొనసాగించారు. వాహనదారులకు బ్రీత్ అనలైజర్ మిషన్ ద్వారా వారు సేవించిన మద్యం మోతాదును పరిశీలించారు. మోతాదుకు మించి మద్యం సేవించిన ముగ్గురిపై కేసులు నమోదు చేశారు.
మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు : సీఐ రాజేందర్ రెడ్డి
వాహనదారులు మద్యం సేవించి వాహనం నడిపితే కఠిన చర్యలు తప్పవు. ప్రభుత్వం, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. మద్యం ప్రియులు కుటుంబాలను దృష్టిలో పెట్టుకుని మద్యం సేవించకుండా వాహనాలు నడపాలి. మద్యం మత్తులో ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగితే కుటుంబాలకు కలిగే నష్టాలను భరించలేం

