రండి.. ఓటర్లుగా చేరండి..!
– మల్కాపూర్లో ఓటరు నమోదుకు ప్రత్యేక శిబిరం
– ఆర్సీ గౌడ్ యువసేన ఆధ్వర్యంలో ఏర్పాట్లు
– బీఆర్ఎస్ బీసీ సెల్ అధ్యక్షులు ఆర్సీగౌడ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : రండి.. ఓటర్లుగా చేరండి అంటూ బీఆర్ఎస్ తాండూరు మండల బీసీ సెల్ అధ్యక్షులు ఆర్.చంద్రశేఖర్ గౌడ్(ఆర్సీగౌడ్) పిలుపునిచ్చారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మండలంలో ఓటరు నమోదు కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. మండలంలోని మల్కాపూర్ గ్రామంలో ఆర్సీ గౌడ్ యువసేన ఆధ్వర్యంలో నేడు గురువారం ప్రత్యేక ఓటరు నమోదు శిబిరం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఇందులో పాత ఓటర్లు తిరిగి నమోదు చేసుకునేందుకు, ఓటు హక్కుకు వయోపరిమితి పొందిన యువతీ యువకులతో ఓటరు నమోదు చేయించడం జరుగుతుందని తెలిపారు.
ఓటర్లు శిబిరానికి ఆధార్ కార్డుతో పాటు తమకు సంబంధించిన వివరాలతో వస్తే చాలని, అందరి చేత ఉచితంగా ఓటరు నమోదు చేయించే బాధ్యతను తీసుకున్నట్లు తెలిపారు. ఓటరు నమోదుకు గడువు లేకపోవడంతో ప్రత్యేకంగా ఓటరు నమోదు శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మల్కాపూర్తో పాటు పరిసర గ్రామాల ఓటర్లు వచ్చి హక్కును నమోదు చేయించుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు మండల మైనార్టీసెల్ అధ్యక్షులు, మల్కాపూర్ మాజీ ఉప సర్పంచ్ హసన్ పటేల్ను సంప్రదించవచ్చన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఓటర్లుగా చేరాలని విజ్ఞప్తి చేశారు.
ఇదికూడా చదవండి…

