రెచ్చిపోయిన దొంగలు..!
– మూడు ఇండ్లలో వరుస చోరీలు
– బషీరాబాద్ పర్శ్యానాయక్ తాండాలో ఘటన
– పరిశీలించిన డీఎస్పీ, రూరల్ సీఐ
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం బషీరాబాద్ మండలంలోని పర్ష్యానాయక్ తాండాలో దొంగలు రెచ్చిపోయారు. రాత్రి సమయాల్లో చోరిలకు పాల్పడి అందినకాడికి దోచుకెళ్లారు. దోచుకెళ్లిన వాటిలో పనికిరాని వస్తువులను గ్రామ శివారులో పడేసీ పరారయ్యారు. బుధవారం ఉదయం వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన కలకలం రేపింది.బషీరాబాద్ ఎస్ఐ గఫ్పార్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
తాండాకు చెందిన చవాన్ గోపాల్, చవాన్ పాండులకు సంబంధించిన ఇండ్లలో గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి ఇంట్లో వస్తువులను చిందర వందర చేశారు. చవాన్ గోపాల్ ఇంట్లో కూడా చొరబడి రూ. 40వేలు దోచుకున్నారు. పాండు ఇంట్లో 4తులాల బంగారం, 16 తులాల వెండి పట్టీలు ఎత్తుకెళ్లిపోయారు. అదేవిధగా రాందాస్ ఇంట్లో కూడా చొరబడి ఓ సెల్ ఫోన్, వస్తువులను ఎత్తుకెళ్లారు. దొంగతనం తరువాత గ్రామ శివారుకు వెళ్లి పనికిరాని వస్తువులను అక్కడే పడేసి వెళ్లిపోయారు.
బుధవారం ఉదయం బాధితుల కుటుంబ సభ్యులు పరిశీలించి విస్తుత పోయారు. విషయాన్ని బషీరాబాద్ పోలీసులకు తెలిపారు. ఎస్ఐ గఫ్పార్ తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి, రూరల్ సీఐ శ్రీనివాస్ రెడ్డిలకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ, రూరల్ సీఐ తాండాను సందర్శించి చోరీల వివరాలను ఆరా తీశారు. ఈ మేరకు దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. మరోవైపు మారుమూల ప్రాంతాల్లో దొంగలు రెచ్చిపోవడం పట్ల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గ్రామాల్లో దోపిడీలు జరగకుండా గస్తీలను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
ఇదికూడా చదవండి…

