మీ సేవ కనెక్ట్ యాప్..!
– అరచేతిల్లోనే అన్ని సేవలు
– 300లకు పైగా పౌరసేవలు
– అందుబాటులోకి తెచ్చిన సర్కారు
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : ప్రజలకు సులువుగా సేవలను అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం మీ సేవా కనెక్ట్ యాప్ను అందుబాటులోకి తెచ్చింది. పలు రకాల ధ్రువపత్రాల కోసం దళారుల ప్రమేయం లేకుండా 2011లో మీ-సేవ కేంద్రాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. రెవెన్యూ, వ్యవసాయం, పోలీసు, విద్య, వైద్యం, విద్యుత్తు.. ఇలా వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించి సుమారు 300 లకు పైగా పౌరసేవలను మీ-సేవ కేంద్రాల్లో పొందే వెలుసుబాటు కల్పించారు. నిర్వాహకులకు కమీషన్ రూపంలో కొంత చెల్లిస్తున్నారు.
తాజాగా మరో తొమ్మిది సేవలను అమల్లోకి తెచ్చారు. మీ-సేవ కేంద్రాల్లో కొత్తగా తొమ్మిది సేవలను ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. రెవెన్యూ శాఖ నుంచి గ్యాప్ ధ్రువపత్రం, నేమ్ ఛేంజ్ ఆఫ్ సిటిజన్, లోకల్ కాండిడేట్, మైనారిటీ ధ్రువపత్రం, క్రిమిలేయర్, నాన్ క్రిమిలేయర్ ధ్రువపత్రం, ఆదాయం, కుల ధ్రువపత్రాల పునఃజారీ, మహిళ శిశు సంక్షేమ శాఖకు సంబంధించి సీనియర్ సిటిజన్ మెయింటెనెన్స్ మానిటరింగ్ సిస్టం ధ్రువ పత్రం, అటవీశాఖకు సంబంధించిన వన్యప్రాణుల దాడిలో మరణించిన మనుషులు, పశువులకు పరిహారం దరఖాస్తు, టింబర్ డిపో నూతన, రెన్యూవల్ దరఖాస్తులను మీ-సేవ ద్వారా చేసుకునే అవకాశం కల్పించారు.
త్వరలో మరిన్ని సేవలు అందుబాటులోకి రానున్నట్లు తెలిసింది. గతంలో పహానీలు, 1బీ లను కేంద్రాల నుంచి పొందేవారు. ధరణి అమల్లోకి వచ్చిన నుంచి అవి నిలిచి పోవడంతో గిరాకీలు తగ్గాయని నిర్వాహకులు చెబుతున్నారు. ప్లేస్టోర్ నుంచి యాప్ను డౌన్లోడ్ చేసుకొని ధ్రువపత్రాల కోసం చరవాణి ద్వారానే దరఖాస్తు చేసుకోవచ్చు. ఉమ్మడి జిల్లాలో సుమారు 260 వరకు మీ-సేవ కేంద్రాలు ఉన్నట్లు అంచనా.
ఇదికూడా చదవండి…

