వామ్మో.. ఎండలు..!
– వచ్చే నాలుగు రోజులు జాగ్రత్త
– వాతావరణ శాఖ హెచ్చరిక
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. వచ్చే నాలుగు రోజులు ఎండలు దండి కొడతాయని తెలిపారు. ఈ రోజు నుంచి మార్చి 2 వరకూ ఎండల ప్రభావం తీవ్రంగా ఉంటుందని తెలిపారు. బంగాళాఖాతంలో గాలివేగం 30 కిలోమీటర్లుగా ఉంది. ఏపీలో గంటకు 12 కిలోమీటర్లు, తెలంగాణలో గంటకు 13 కిలోమీటర్లుగా ఉంటుంది. శ్రీలంక కింద ఒక అల్పపీడనం ఏర్పడేలా ఉంది. గాలులన్నీ ఇప్పుడు అక్కడికే వెళ్లిపోతున్నాయి.

అల్పపీడనం ప్రభావం వచ్చే వారం తెలుగు రాష్ట్రాలపై కనిపించే అవకాశాలున్నాయి. ఉష్ణోగ్రత తెలంగాణలో 31 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. ఏపీలో 34 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. ఐతే.. రెండు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల అత్యధిక ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల సెల్సియస్ కూడా ఉంటాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ, పశ్చిమ రాయలసీమ, కోస్తా నుంచి ఉత్తరాంధ్ర వరకూ ఎండలు దంచేస్తాయి. తేమ రెండు రాష్ట్రాల్లో 30 నుంచి 40 శాతం ఉంది. తేమ దాదాపు పెరగట్లేదు. అందువల్ల వేడి ఎక్కువవుతుంది. రెండు రాష్ట్రాల్లో శివరాత్రి తర్వాత వేడి పెరగడం కామన్. కాబట్టి.. ఇక్కడి నుంచి మనం అప్రమత్తంగా ఉండాలి.
బాడీ డీ-హైడ్రేషన్ అవ్వకుండా చూసుకోవాలి. శరీరంలో తేమ తగ్గిపోతే, వడదెబ్బ తగలగలదు. అది ప్రాణాంతకం. కాబట్టి.. ఎండల విషయంలో అప్రమత్తంగా ఉండటం మంచిది. ఉదయం 11 గంటల తర్వాత ఇళ్ల నుంచి బయటకు వెళ్లొద్దని సూచించారు. పిల్లలు, ముసలివారు, గుండె జబ్బులు ఉన్నవారూ, ఆస్తమా బాధితులు, మానసిక సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. రోజూ కనీసం 4 లీటర్ల నీరు తాగాలనీ, సాయంత్రం 4 గంటల వరకూ ఎండ నుంచి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఇదికూడా చదవండి…

