రైతులు అస్సలు ‘మిస్’ చేసుకోవద్దు..!
– కేంద్రం నుంచి రూ. 3లక్షల వరకు రుణాలు
– సంవత్సరంలో వడ్డీపై 4శాతం రాయితీ
– అర్హతలు, దరఖాస్తుల విధానం ఇలా..
దర్శిని డెస్క్ : రైతులకు ఆర్థిక భరోసా కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం వడ్డీ రాయితీ పథకం (MISS) అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా రైతులు తక్కువ వడ్డీకే రూ. 3 లక్షల వరకు లోన్ పొందవచ్చు. సవరించిన వడ్డీ రాయితీ పథకం (Modified Interest Subvention Scheme – MISS) గా పేర్కొంటున్న ఈ స్కీమ్ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం 2025-26 ఆర్థిక సంవత్సరానికి కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ పథకంలో రైతులకు సంవత్సరంలో 4శాతం వరకు వడ్డీ రాయితీని కల్పిస్తోంది. ఈ పథకం కోసం రైతులు ఎలాంటి నిబంధనలు పాటించాలి.. దరఖాస్తులు, అర్హతల వివరాలను తెలుసుకోవాలి.

రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కిసాన్ క్రెడిట్ కార్డు (KCC)తో రూ. 3 లక్షల వరకు లోన్ తీసుకోవచ్చు. 7 శాతం వార్షిక వడ్డీకే రైతులకు ఈ రుణాలను ఇస్తారు. సకాలంలో చెల్లిస్తే, మరింత రాయితీ లాంటి అదనపు ప్రయోజనాలు కూడా ఉంటాయి. ప్రధానంగా వ్యవసాయ కార్యకలాపాలకు అవసరమైన స్వల్పకాలిక పంట రుణాలతో పాటు పశుపోషణ, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ, ఫిషరీస్ లాంటి అనుబంధ రంగాలకు తీసుకునే రుణాలకు ఈ పథకం వర్తిస్తుంది. పశు సంవర్ధకం లేదా మత్స్య పరిశ్రమ కోసం తీసుకున్న రుణాలపై రూ.2 లక్షల వరకు వడ్డీ రాయితీ వర్తిస్తుంది.
ఈ పథకం కింద, రూ. 3 లక్షల వరకు వ్యవసాయ రుణాలను 7 శాతం వడ్డీకే ఇస్తారు. రైతులకు బ్యాంకులు కల్పించే 1.5 శాతం వడ్డీ రాయితీకి సరిపడా మొత్తాన్ని బ్యాంకులకు ప్రభుత్వం చెల్లిస్తుంది. ఇక రుణాలను సకాలంలో తిరిగి చెల్లించిన రైతులకు అదనంగా 3 శాతం వడ్డీ రాయితీ (Prompt Repayment Incentive – PRI) లభిస్తుంది. దీనివల్ల మొత్తంగా రైతులు చెల్లించాల్సిన వడ్డీ రేటు సంవత్సరానికి 4 శాతానికి తగ్గుతుంది. ఈ పథకాన్ని మరోసారి పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

రైతుల అర్హతలు ఇవే..
ఈ పథకం ప్రధానంగా రైతులకు ఉద్దేశించబడింది. వయస్సు 18 ఏళ్ల నుంచి 75 ఏళ్ల మధ్య ఉండాలి. సొంత భూమి ఉండి వ్యవసాయం చేస్తున్న రైతులు అర్హులు. పాడి రైతులు, చేపల రైతులు, కోళ్ల రైతులు కూడా అర్హులు. అదేవిధంగా కౌలు రైతులు, షేర్ క్రాపర్స్, లీజుదారులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..?
సాధారణంగా కిసాన్ క్రెడిట్ కార్డ్ లేదా ఇతర వ్యవసాయ రుణాల దరఖాస్తు ప్రక్రియతో సమానమైన విధానాన్నే వడ్డీ రాయితీ పథకంలో అనుసరిస్తారు. మీరు ఏ బ్యాంకు నుంచి రుణం పొందాలనుకుంటున్నారో, ఆ బ్యాంకు శాఖను సంప్రదించి పూర్తి సమాచారం పొందవచ్చు. వడ్డీ రాయితీ పథకానికి ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది బ్యాంకుల ద్వారా వ్యవసాయ రుణాలు తీసుకునే రైతులకు ఆటోమేటిక్గా వర్తిస్తుంది.
అవసరమైన పత్రాలు
గుర్తింపు (ఐడెంటిటీ) కార్డు (ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ ఐడీ లాంటివి).
అడ్రస్ ఫ్రూఫ్ (ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, కరెంట్ బిల్లు లేదా గ్యాస్ బిల్ లాంటివి).
భూ యాజమాన్య పత్రాలు (భూమి రికార్డులు లేదా పట్టాదార్ పాస్ బుక్)
బ్యాంకు ఖాతా వివరాలు

ఇదికూడా చదవండి…

