మాజీ సర్పంచే.. ముద్దాయి..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

మాజీ సర్పంచే.. ముద్దాయి..!
– పంచాయతీ ట్రాక్టర్ చోరీలో సూత్రదారి
– బషీర్‌మీయా తాండా ఘటనలో ట్విస్ట్
– 24 గంటల్లో కేసు చేధించిన యాలాల పోలీసులు
యాలాల, దర్శిని ప్రతినిధి : గ్రామ పరిపాలనలో సేవలందించిన మాజీ సర్పంచ్ పంచాయతీ ట్రాక్టర్ చోరీ కేసులో ముద్దాయిగా మారారు. యాలాల మండలం బషీర్‌మీయా తాండా పంచాయతీ ట్రాక్టర్ చోరీ కేసులో ట్విస్ట్ ఏర్పడింది.

మాజీ సర్పంచు మిత్రు నాయక్‌ ప్రధాన నిందితుడుగా మారారు. కేసు నమోదు చేసుకున్న యాలాల పోలీసులు 24 గంటల్లోనే కేసును చేధించడమే కాకుండా నిందితున్ని రిమాండుకు తరలించారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. తాండాకు చెందిన ట్రాక్టర్(చాసీ నెంబర్ 006511260B1) ట్రాలీతో పాటు డ్రైవర్ వర్త్యా సుభాష్‌ ఈనెల 3న సాయంత్రం తాండాలోని వాటర్ ట్యాంకు దగ్గర నిలిపి ఉంచాడు.

మరుసటి రోజే ట్రాక్టర్ చోరీకి గురయ్యింది. పంచాయతీ సెక్రెటరీ వెంకట్ రెడ్డి యాలాల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మంగళవారం పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఎస్ఐ విఠల్ రెడ్డి ఆధ్వర్యంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. సీసీ పుటేజీలను పరిశీలించగా గ్రామ మాజీ సర్పంచ్ మిత్రునాయక్ పాత్ర వెలుగులోకి వచ్చింది.

అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించినట్లు తెలిసింది. ట్రాక్టర్‌ను హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని ఘట్కేసర్ సమీపంలో ఓ స్క్రాఫ్ దుకాణానికి తీసుకెళ్తున్నట్లు సీసీ కెమెరాలో పోలీసులు గుర్తించినట్లు సమాచారం. గ్రామ మాజీ సర్పంచే ట్రాక్టర్ చోరీలో నిందితుడుగా మారడం చర్చనీయాంశంగా మారింది.

భద్రేశ్వర దేవాలయానికి నోటిఫికేషన్