నాపరాతి ట్రాక్టర్ బొల్తా..!
– కిందపడి యువకుడి దుర్మరణం
– యాలాల రాస్నం వద్ద ఘటన
– తాండూరు ఇందిరానగర్లో విషాదం
తాండూరు, దర్శిని ప్రతినిధి : నాపరాతి లోడ్తో వెళుతున్న ఓ ట్రాక్టర్ బొల్తాపడడంతో కిందపడి ఓ యువకుడు దుర్మరణం చెందాడు.

ఈ సంఘటన యాలాల మండలం రాస్నం గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. యాలాల ఎస్ఐ విఠల్ రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తాండూరు పట్టణం ఇందిరానగర్ ప్రాంతానికి చెందిన బోడ శ్రీకాంత్(19) శుక్రవారం ట్రాక్టర్(టీఎస్ 34 టీఏ 6528, ట్రాలీ ఏపీ 27హెచ్ 5281)లో నాపరాతి లోడ్ నింపుకుని తాండూరు నుంచి యాలాల మండలం రాస్నం వైపు వెళుతున్నాడు. మార్గ మద్యలోని పగిడాల గ్రామ సమీపంలోని మలుపు వద్ద ట్రాక్టర్ అదుపు తప్పి బొల్తా కొట్టింది.

ఈ క్రమంలో ట్రాక్టర్ నడుపుతున్న శ్రీకాంత్ కిందపడి తీవ్రగాయాలపాలయ్యాడు. కొద్ది సేపటికే శ్రీకాంత్ ప్రమాద స్థలంతోనే దుర్మరణం చెందాడు. ఈ విషయం తెలుసుకున్న యాలాల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాండూరులోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి మార్చురికి తరలించారు.

ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ విఠల్ రెడ్డి తెలిపారు. మరోవైపు శ్రీకాంత్ మృతి చెందడంతో కుటుంబంతో పాటు ఇందిరానగర్లో విషాధ చాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించగా బంధువులు, మిత్రులు విచారం వ్యక్తం చేశారు.


