ప్రభుత్వ వైఫల్యం వల్లే ఫీజుల భారం

తాండూరు రాజకీయం వికారాబాద్

ప్రభుత్వ వైఫల్యం వల్లే ఫీజుల భారం
– విద్యాశాఖ మంత్రి లేకపోవడం సిగ్గుచేటు
– బీజేపీ కౌన్సిలర్ అంతారం కిరణ్‌
తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రభుత్వ వైఫల్యం కారణంగా పేదలపై ప్రైవేటు ఫీజుల భారం పడుతోందని తాండూరు మున్సిపల్ బీజేపీ కౌన్సిలర్ అంతారం కిరణ్‌ అన్నారు.

గురువారం ఆయన ఓ ప్రకటనలో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులను కట్టడి చేయడంలో పూర్తిగా విఫలమయ్యిందని ఆరోపించారు. పట్టణంలోని ప్రైవేట్ పాఠశాలలు విద్యార్థుల తల్లిదండ్రులపై ఫీజుల అధిక ఆర్థిక భారం మోపుతున్నాయని ఆవేధన వ్యక్తం చేశారు.

ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేయడమే కాకుండా, పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, యూనిఫార్ములు మరియు ఇతర విద్యా సామగ్రిని పాఠశాలల నుంచే కొనుగోలు చేయాలని బలవంతం చేస్తున్నాయన్నారు. దీంతో సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం లో విద్యాశాఖ మంత్రి లేకపోవడం చాలా సిగ్గుచేటని అన్నారు.

ఈ వైఫల్యం కారణంగానే పేదలపై ఫీజుల భారం పడుతుందని అన్నారు. తాండూరు విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి ప్రైవేట్ పాఠశాలల ఫీజులపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించి, నిబంధనలను ఉల్లంఘిస్తున్న పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పుస్తకాలు, యూనిఫార్ములు తదితర వస్తువులను నిర్దిష్ట దుకాణాల నుండి కొనుగోలు చేయాలని ఒత్తిడి చేసే విధానాన్ని అరికట్టాలని విజ్ఞప్తి చేశారు. లేదంటే తాండూరు భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ తరపున విద్యాశాఖ కార్యాలయాన్ని ముట్టడి చేస్తామని హెచ్చరించారు.

డీఈ లేకా పట్టణాభివృద్ధి డీలా..!