హామిల అమలులో సర్కారు విఫలం
– ఇంకా జాప్యం చేస్తే ఆందోళనలు ఉదృతం
– బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ పంజుగుల శ్రీశైల్ రెడ్డి
– గ్యారెంటీలు నెరవేర్చాలని ఆర్డీఓకు వినతి
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ పార్టీ తాండూరు నియోజవర్గ ఇంచార్జ్ పంజుగుల శ్రీశైల్ రెడ్డి విమర్శించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనపై వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన సమరభేరీ కార్యక్రమంలో భాగంగా సోమవారం తాండూరు ఆర్డీఓ కార్యాలయంలో వినతిపత్రం అందజేత కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా తాండూరు ఇంచార్జ్ శ్రీశైల్ రెడ్డి పార్టీ నేతలతో కలిసి ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లారు.

ఆర్డీఓ అనితను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా శ్రీశైల్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలు, ఇతర హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. హామీల అమలులో జాప్యం చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మరింత ఉధృతంగా ప్రజా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.

రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వ విధానాలతో అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆరు గ్యారంటీలు, 420 హామీలను వెంటనే అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రం అందజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు పట్లోళ్ల నర్సింలు, వర్కింగ్ ప్రెసిడెంట్ నరేందర్ గౌడ్, కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.


