జాతీయ పోటీలో పీపుల్స్ కళాశాల విద్యార్థి సత్తా
– సన్మానించిన కళాశాల కరస్పాండెంట్ ఉత్తమ్ చంద్
తాండూరు, దర్శిని ప్రతినిధి : జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీలో తాండూరు పీపుల్స్ డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థి సత్తా చాటి ద్విదీయ స్థానంలో మెరిశాడు.
ఉస్మానియా యూనివర్సిటీ ద్వారా నిర్వహించిన ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ 2021-22లో పీపుల్స్ కళాశాలకు చెందిన డి. కిషన్ అనే విద్యార్థి పాల్గొన్నారు. 10 కిలో మీటర్ల పరుగు పందెంలో రాణించి ద్వితీయ స్థానంలో నిలిచాడు. దీనిని పురస్కరించుకుని బుధవారం పీపుల్స్ డిగ్రీ కళాశాలలో విద్యార్థి కిషన్కు సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల కరస్పాండెంట్ పి. ఉత్తమ్ చంద్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థి కిషన్ను శాలువాతో ఘనంగా సన్మానించారు.
జాతీయ స్థాయి పోటీలో రాణించి ద్వితీయ స్థానంలో నిలవడం పట్ల అభినందించారు. ముందు ముందు అంతర్జాతీయ స్థాయిలో రాణించి కళాశాలకు, తాండూరుకు మంచి పేరు తీసుకరావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ సత్యానంద్ కుమార్, అధ్యాపకులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.


