కరుణించు కట్టమైసమ్మ తల్లీ..!
– అంగరంగ వైభవంగా జాతర ఉత్సవాలు
– దర్శించుకున్న కౌన్సిలర్ మంకాల రాఘవేందర్, పెద్దలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : కరుణించు కట్ట మైసమ్మ తల్లీ అంటూ భక్తులు అమ్మవారిని వేడుకున్నారు. ఆదివారం తాండూరు పట్టణంలోని గుమస్తా నగర్ లో వెలసిన శ్రీ కట్ట మైసమ్మ మాత బోనాల పండుగ అంగరంగ వైభవంగా జరిగింది. జాతర ఉత్సవాల సందర్భంగా ఆలయంలో వెలసిన అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
అభిషేకం ,కుంకుమార్చన, మహామంగళహారతి, పల్లకి సేవ కార్యక్రమాలతో పాటు భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆలయం నుంచి పురవీధుల్లో అమ్మవారి పల్లకిసేవ శోభాయామానంగా కొనసాగింది. ఈ పల్లకిసేవ ఊరేగింపులో వార్డు కౌన్సిలర్ మంకాల రాఘవేందర్తో పాటు వార్డు పెద్దలు, నాయకులు, యువకులు పాల్గొన్నారు. కౌన్సిలర్ మంకాల రాఘవేందర్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రజలను సల్లంగా చూడాలని వేడుకున్నారు. మరోవైపు అమ్మవారి జాతర ఉత్సవాల సందర్భంగా మహిళ భక్తులు బోనాలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. బోనాలతో అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.


