గ్రామ కార్యదర్శిపై వేటు
– సస్పెండ్ చేసిన జిల్లా కలెక్టర్
– నర్సరీ నిర్వహణ నిర్లక్ష్యం పట్ల చర్యలు
వికారాబాద్, దర్శిని ప్రతినిధి: ప్రభుత్వ కార్యక్రమాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన గ్రామ కార్యదర్శిపై వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. జిల్లా కలెక్టర్ మొదటిసారి ఈ చర్యలకు ఉపక్రమించడం చర్చనీయాంశమైంది. వివరాల్లోని వెళితే శుక్రవారం జిల్లా కలెక్టర్ నిఖిల పరిగి మండలం, జాఫర్ పల్లి గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా నర్సరీలను పరిశీలించారు. నర్సరీ నిర్వహణ అస్తవ్యస్థంగా ఉండడంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. నర్సరీ నిర్వహణలో నిర్లక్ష్యం వహించడంపట్ల గ్రామ పంచాయతీ కార్యదర్శి లలితపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెపై వెంటనే చర్యలు తీసుకోవాలని సంబంధిత జిల్లా పంచాయతీ అధికారిని ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నర్సరీల నిర్వహణపై నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం కలెక్టర్ కె.నిఖిల గ్రామ కార్యదర్శిని సస్పెండ్ చేసిన విషయాన్ని స్వయంగా ప్రకటించారు. కలెక్టర్ వెంట డీఆర్డీఓ కృష్ణన్, పరిగి ఎంపీడీఓ, ఎంపీవో తదితరులు ఉన్నారు.

