స‌మ్మె విర‌మించిన మున్సిప‌ల్ కార్మికులు

ఆరోగ్యం తాండూరు వికారాబాద్

స‌మ్మె విర‌మించిన మున్సిప‌ల్ కార్మికులు
– అడిష‌న‌ల్ క‌లెక్ట‌ర్ హామితో విర‌మ‌ణ
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: డిమాండ్లు నెర‌వేర్చాల‌ని నిర‌వ‌ధిక‌ స‌మ్మె చేప‌ట్టిన మున్సిప‌ల్ కార్మికులు తిరిగి విధుల్లో చేరిపోయారు. వికారాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ మోతిలాల్ హామీ మేరకు కార్మికులు సమ్మెను విరమించారు. మున్సిపల్‌లోని కాంట్రాక్టు కార్మికులకు పెంచిన వేతనాలను అమలు చేయాలని, 18 మంది కార్మికులకు వేతనాలను అందించాలని, వారసత్వ ఉద్యోగాలను అనుమతించాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ ఏఐటీయూసీ యూనియన్ ఆధ్వర్యంలో వారం క్రితం సమ్మె చేపట్టిన విషయం తెలిసిందే. మంగళవారం కార్మికులు వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి తరలివెళ్లి నిరసన వ్యక్తం చేశారు. అక్కడ అడిషనల్ కలెక్టర్ మోతిలాల్‌కు వినతిపత్రం అందజే శారు. ఇందుకు అడిషనల్ కలెక్టర్ మోతిలాల్ స్పందించి త్వరలోనే పెంచిన వేతనాలు చెల్లించేలా చూస్తామని, వారసత్వ ఉద్యోగాల అనుమతి, కార్మికులకు వేతనాల చెల్లింపుపై కమిటీ వేసి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో బుధవారం ఉదయం నుంచే పారిశుద్ధ్య కార్మికులు విధుల్లో చేరి వీధుల్లో చెత్త చెదారం తొలగించారు. మురుగు కాలువలను శుభ్రం చేశారు. వారం రోజులుగా ఎక్కడికక్కడ పేరుకుపోయిన చెత్త కుప్పలను తరలించారు. మున్సిపల్ కార్మికులు విధుల్లో చేరి పారిశుద్ధ్య ప‌నులు చేప‌ట్ట‌డంతో వారం రోజుల‌ కంపు నుంచి పట్టణ వాసులు ఊపిరిపీల్చుకున్నారు.