ప్రజలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి

క్రైం తాండూరు వికారాబాద్

ప్రజలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి
– తాండూరు జూనియర్ సివిల్ జడ్జి టీ.స్వప్న
– త‌ట్టెపల్లిలో న్యాయ విజ్ఞాన సదస్సు

పెద్దేముల్, ద‌ర్శిని ప్ర‌తినిధి: ప్రజలు ప్రభుత్వాలు చేసే చట్టాలు పై అవగాహన కలిగి ఉండాలని తాండూరు జూనియర్ సివిల్ కోర్టు జడ్జి స్వప్న అన్నారు. శనివారం మండల పరిధిలోని త‌ట్టెపల్లి గ్రామంలో మండల న్యాయ సేవాధికార సంస్థ, న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వ‌హించారు. ఈ స‌ద‌స్సులో న్యాయ‌మూర్తి టీ.స్వ‌ప్న మాట్లాడుతూ ప్రభుత్వాలు చేసే చట్టాలు పై ప్రజలకు అవగాహన కలిగి ఉండాలని అన్నారు. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల తో పాటు ప్రభుత్వ చట్టాలకు లోబడి ప్రజలు తమ జీవన విధానం కొనసాగించాలని సూచించారు. క్షణికావేశంలో చేసిన పొరపాట్ల వల్ల ఆర్థికంగా సామాజికంగా ఎంతో విలువైన జీవితాల‌ను, సమయాన్ని వృధా చేసుకోవద్ద‌న్నారు. పరిసర గ్రామాల్లో బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయని ఇది నిరోధించేందుకు ప్రజలకు అవగాహన కల్పించాలని పోలీసులకు సూచించారు. అదేవిధంగా రెవెన్యూ చట్టాలపై కే శ్రీనివాస్ న్యాయవాది, మహిళా చట్టాల పై విజయలక్ష్మీ పండిట్, సమాచార హక్కు చట్టం పై సుదర్శన్, ముస్లిం పర్సనల్ లా మహమ్మద్ బేగం, బాల్య వివాహాల పై అనిత గుప్తా ప్రజలకు కు అవగాహన కల్పించారు. న్యాయవాదుల సంఘం అధ్యక్షులు చంద్రశేఖర్ మాట్లాడుతూ పెద్దేముల్ మండలం త‌ట్టెపల్లి గ్రామానికి ప్రత్యేక స్థానం ఉందని ఇక్కడ అ బాల్యవివాహాలు భూ వివాదాలు అధికంగా ఉన్నాయని గ్రహించి వాటి పరిష్కారానికి ప్రజల పై ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించేందుకు ఈ న్యాయ విజ్ఞాన సదస్సు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. తాండూరు రూరల్ సీఐ రాంబాబు మాట్లాడుతూ అత్యవసర సమయాల్లో ప్రజలు వందకు ఫోన్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, ఎంపీటీసీ, న్యాయవాదుల సంఘం ఉపాధ్యక్షులు పి మహేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రవీందర్ రెడ్డి, సహ కార్యదర్శి రజిత, కోశాధికారి సుదర్శన్ తో పాటు సీనియర్ న్యాయవాదులు బాలి శివకుమార్, అగ్గనూర్ శ్రీనివాస్, నర్సింగ్ రావు, రవీందర్, సోఫియా బేగం, పాశం రవికుమార్, బి రవి కుమార్, విశ్వనాథన్, వాణిశ్రీ, బందెప్ప తదితరులు పాల్గొన్నారు.