తెలంగాణలో మంకీపాక్స్ కేసు..?
– కామారెడ్డి జిల్లాలో అలజడి
– వ్యక్తికి లక్షణాలు, నమూనాల సేకరణ
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: దేశంలో మంకీపాక్స్ రేపుతున్న కలకలం తెలంగాణకు పాకిందా అనే ఆందోళనను కలిగిస్తోంది. ఇప్పటికే దేశంలో నమోదైన నాలుగు మంకీపాక్స్ కేసులు భయాందోళనకు గురిచేస్తుంటే తాజాగా తెలంగాణలో కేసు నమోదైనట్లు అనుమానం రేకెత్తిస్తోంది. కామారెడ్డి జిల్లాలో ఓ వ్యక్తికి మంకీపాక్స్ సోకినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నెల 6న కువైట్ నుంచి కామారెడ్డికి వచ్చిన ఓ వ్యక్తికి లక్షణాలు కనిపించడంతో.. బ్లడ్ శాంపిళ్లను సేకరించి హైదరాబాద్లోని ఫీవర్ ఆసుపత్రికి పరీక్షల కోసం తరలించారు. మంకీపాక్స్ లక్షణాలున్నట్లు అనుమానిస్తున్న బాధితుడిని కామారెడ్డి ఏరియా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటనతో అధికారులు అప్రమత్తమయ్యారు. పరీక్షల రిపోర్టు అనంతరం అన్ని విషయాలను వెల్లడిస్తామని అధికారులు పేర్కొంటున్నారు. మరోవైపు లక్షణాలు ఉన్న వ్యక్తితో సన్నిహితంగా ఉన్న వారి వివరాలను సేకరించారు. వారందరినీ పర్యవేక్షణలో ఉంచినట్లు తెలుస్తోంది. అయితే ప్రభుత్వం, అధికారుల నుంచి దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.



