ఆరేళ్లుగా వృక్షానికి జయంతి..!
– పూజలు చేసిన మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ
– స్వర్గీయ కోట్రిక వెంకటయ్యకు నివాళులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లాలోని తాండూరులో గత ఆరేళ్లుగా వృక్షానికి జయంతి వేడుకలు నిర్వహిస్తున్నారు. కుటుంబ పెద్ద తాను జీవించిన సమయంలో నాటిన మొక్కకు ఆయన మరణాంతరం దానికి జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్నారు. వివరాల్లోకి వెళితే తాండూరు పట్టణంకు చెందిన మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కోట్రిక విజయలక్ష్మి భర్త స్వర్గీయ కోట్రిక వెంకటయ్య నాలుగేళ్ల క్రితం తన జన్మదినం సందర్భంగా ఇంటి సమీపంలో మొక్కను నాటారు. కొన్నేండ్ల తరువాత ఆయన అనారోగ్యంతో మృతి చెందారు. ఆప్పటి నుంచి ఆయన సతీమణి తాండూరు మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మి, వారి కుటుంబ సభ్యులు ఆ చెట్టును బాధ్యతగా సంరక్షిస్తూ ప్రతి యేడాది కోట్రిక వెంకటయ్య జన్మదినం రోజున ఆ చెట్టుకు పుట్టిన రోజు వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ ఆనవాయితీని ఆయనకు నివాళిగా ఆరేళ్లుగా కొనసాగిస్తున్నారు. తాజాగా శుక్రవారం కూడ కోట్రిక వెంకటయ్య జయంతి సందర్భంగా భాగంగా ఆ చెట్టుకు 6వ పుట్టినరోజు జరిపారు. చెట్టుకు ప్రత్యేక అలంకరణ చేసి కోట్రిక విజయలక్ష్మి, ఆమె కుటుంబ సభ్యులు చెట్టుకు పూజలు నిర్వహించారు.



