దేశానికి ప్రతిష్టాత్మకం సౌర వ్యవస్థ
– సోలార్ విద్యుదీకరణ, హైడ్రోజన్ గ్యాస్ వ్యవస్థలతో మార్పు
– రామగుండం సోలార్ ప్రాజెక్టును ప్రారంభించిన ప్రధాని మోదీ
– వర్చువల్ వేదికగా ప్రారంభోత్సవం
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: సాంకేతిక వల్ల దేశంలో ప్రజలకు ఎన్నో ప్రయోజనాలు అందుతున్నాయని భారత ప్రధాని నరేంద్రమోడి అన్నారు. నూతనంగా ప్రారంభించిన సోలార్ విద్యుదీకరణ, హైడ్రోజజన్ గ్యాస్ వ్యవస్థలతో ప్రజల జీవితాల్లో గణనీయ మార్పలు జరగడం ఖాయమని పేర్కొన్నారు. ఇలాంటి ప్రాజెక్టులు దేశానికి ప్రతిష్టాత్మకం అవుతాయన్నారు. శనివారం ప్రధాని నరేంద్రమోడి ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం కేంద్రంలో ‘ఉజ్వల భారత్- ఉజ్వల భవిష్యత్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. వర్చువల్ వేదికగా జరిగిన ఈ సమావేశంలో మోడి మాట్లాడుతూ రామగుండం 100 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టుతో పాటు కేరళలోని 92 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టులు దేశంలోనే పెద్దవి. ఈ ప్రాజెక్టులు సూర్యరశ్మి, విద్యుత్తో పాటు నీరు ఆవిరి కాకుండా సంరక్షిస్తాయి. ప్రతిష్టాత్మక ఈ ప్రాజెక్టులను జాతికి అంకింతం చేస్తున్నట్లు పేర్కొన్నారు. రాబోయే 25 ఏళ్ల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వీటిని ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ ప్రాజెక్టులతో ప్రజల జీవితాల్లో గణనీయమైన మార్పు తీసుకొస్తుందన్నారు. సోలార్ విద్యుత్తో పాటు హైడ్రోజన్ గ్యాస్ వల్ల కలిగే ప్రయోజనాలు దేశ ప్రజలకు చేరబోతున్నాయని వెల్లడించారు. దేశంలో విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ, వినియోగ స్థితిని మెరుగుపరచడానికి ఎన్నో ప్రణాళికలు అమలు చేస్తున్నాం. నాణ్యమైన విద్యుత్ ప్రతి ఒక్కరికీ అందించే విధంగా ప్రణాళిక రూపొందించడమే కాకుండా సంస్కరణలో భాగంగా స్మార్ట్ మీటర్లు ప్రవేశ పెట్టడం జరిగిందని వివరించారు.



