గాల్లో మ‌నిషిని త‌ర‌లించే డ్రోన్‌లు..!

ఆరోగ్యం జాతీయం టెక్నాలజీ తెలంగాణ హైదరాబాద్

గాల్లో మ‌నిషిని త‌ర‌లించే డ్రోన్‌లు..!
– మూడేళ్ల‌లో అంద‌బాటులోకి ఏయిర్ టాక్సీలు
– రెడి చేస్తున్న పూణె ఇంజ‌నీరింగ్ సంస్థ‌
ద‌ర్శిని డెస్క్ : భార‌త దేశంలో సాంకేతిక వ్య‌వ‌స్థ మెరుగుప‌డుతోంది. గాలిలో మ‌నిషి త‌ర‌లించే ఏయిర్ టాక్సీలు త్వ‌ర‌లోనే అందుబాటులోకి రాబోతున్నాయి. వైద్యపరంగా అత్యవసర పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంతాల నుంచి రోగుల్ని తరలించ‌డ‌మే ముఖ్య ఉద్దేశంగా వీటిని అందుబాటులోకి తీసుక‌వ‌స్తున్నారు. మనిషిని మోసుకెళ్లగల అధునాతన ‘వరుణ’ డ్రోన్‌ భారత్‌లో రూపొందుతుంది. పుణెలోని సాగర్‌ డిఫెన్స్‌ ఇంజినీరింగ్‌ సంస్థ ఈ డ్రోన్‌ను తయారుచేసింది. ఇటీవ‌లే డ్రోన్ వ్య‌వ‌స్థ పనితీరును ప్రదర్శించింది. ఈ డ్రోన్‌.. 130 కిలోల బరువు మోయడంతో పాటు ఇది వస్తువుల్ని, మనిషిని మోసుకెళ్లగలదని ఆ సంస్థ ప్రతినిధులు వెల్ల‌డించారు. వైద్యపరంగా అత్యవసర పరిస్థితులు తలెత్తితే గ్రామీణ ప్రాంతాల నుంచి రోగిని ఆసుపత్రికి తరలించవచ్చ‌ని తెలిపింది. రోడ్డుతో పోల్చితే వాయు మార్గంలో ప్రయాణ దూరం మూడు రెట్లు తక్కువగా ఉంటుంద‌ని వివ‌రించారు. రోడ్డు ద్వారా ప్రయాణానికి గంట పడితే.. డ్రోన్‌ ద్వారా 15-20 నిమిషాల్లో చేరుకోవచ్చు. నౌకల మధ్య సరకులను రవాణా చేయగలదు. రక్షణ దళాలకు ఉపయోగపడుతుంది. రానున్న 3-4 ఏళ్లలో ఈ డ్రోన్‌ను ఎయిర్‌ ట్యాక్సీగానూ ఉపయోగించవచ్చని సాగర్‌ డిఫెన్స్‌ ఇంజినీరింగ్‌ సంస్థ సహవ్యవస్థాపకుడు మృదుల్‌ బబ్బర్‌ తెలిపారు.