కటకటాల్లోకి కసాయి మనుమడు
– రిమాండ్కు తరలించిన పోలీసులు
– నాయినమ్మను తన్నినందుకు యాక్షన్
తాండూరు, దర్శిని ప్రతినిధి: ఫించన్ డబ్బుల కోసం సొంత నాయినమ్మను కాలుతో తన్నిన కసాయి మనుమడు కటకటాల్లోకి వెళ్లాడు. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం మంబాపూర్ గ్రామంలో నాయినమ్మను కాలుతో దండించిన మనుమడి సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చినా… సోషల్ మీడీయాలో వైరల్ కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా సంచనలమైన విషయం తెలిసిందే. మంబాపూర్ గ్రామానికి చెందిన చింది యశోదమ్మ అనే వృద్ధురాలును ఆమె మనుమడు గోవర్దన్ ఫించన్ డబ్బులు ఇవ్వాలని కాలుతో తన్నుతూ దాడి చేశాడు. ఈ సంఘటన శుక్రవారం సోషల్ మీడీయాలో రావడంతో జిల్లా ఎస్పీ, తాండూరు డీఎస్పీలు సీరీయస్గా తీసుకున్నారు. అదేరోజు రాత్రి నిందితుడైన గోవర్దన్ను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. పెద్దేముల్ పోలీస్టేషన్లో కేసు నమోదు చేశారు.

శనివారం తాండూరు రూరల్ సీఐ రాంబాబు, పెద్దేముల్ ఎస్ఐ అబ్దుల్ రవూఫ్ల సమక్షంలో నిందితున్ని మీడీయా ముందు ఉంచి వివరాలను వెల్లడించారు. వృద్దురాలు రెండో మనుమడు నరేందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడు గోవర్దన్పై కేసు నమోదు చేసి.. కోర్టులో రిమాండ్ చేసి పరిగి జైలుకు తరలించడం జరిగిందని వివరించారు. మానవత్వం మరిచి నాయినమ్మపై దాడి చేసినందుకు తగిన శాస్తి జరిగిందని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


