కటకటాల్లోకి చీటీంగ్ వ్యాపారి..!
– బాలాజీ చిట్స్ ప్రైవేట్ లిమిటేడ్ ప్రధాన నిందితుడి అరెస్టు
– వివరాలు వెల్లడించిన పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : చిట్టీల డబ్బులు కట్టించుకుని ప్రజలను మోసం చేసిన ఓ చీటీంగ్ వ్యాపారికి తాండూరు పట్టణ పోలీసులు రిమాండుకు పంపించారు. గురువారం తాండూరు పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తాండూరు పట్టణంలోని బస్టాండ్ సమీపంలో నిర్వహిస్తున్న బాలాజీ చిట్స్ ప్రైవేటు లిమిటేడ్ గురించి అందరికి తెలిసిందే. గత కొన్ని రోజులుగా ఈ చిట్స్ సంస్థ దివాల తీసింది. అంతకుముందే ఈ చిట్స్ లిమిటెడ్లో ప్రజల నుంచి రూ. 2 లక్షలు, రూ. 3లక్షలు, రూ. 5 లక్షలు, రూ. 25 లక్షల పేరుతో చిట్టీ డబ్బులు ప్రజల నుంచి కట్టించుకున్నారు. సంస్థ దివాల తీసిన విషయం తెలుసుకున్న బాధితులు నిర్వహకులను నిలదీశారు. చీటీలు వేసిన గోపాల్ గారి బల్వంత్ రెడ్డి, పీ.రమేష్, విజయ్ ఆనంద్, సునీల్ కుమార్, లక్ష్మీకాంత్, మేడిశెట్టి సంగయ్య, మేడిశెట్టి మంజుల, ఎస్ అనిత, మంజుల కందుకూరు కృష్ణారెడ్డి, స్వర్ణలత, మహేష్ పటేల్, నర్మదా, వంశీకృష్ణ, బి.కృష్ణారెడ్డి తదితరులు గత ఆగస్టు నెలలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అప్పట్లో మేనేజింగ్ డైరెక్టర్స్ గంగిశెట్టి శ్రీనివాసులు, గంగిశెట్టి గొ పాలకృష్ణ, గంగిశెట్టి అనురాధ, గంగిశెట్టి సరిత తదితరులపై పోలీసులు చీటింగ్ కేసు, చిట్ ఫండ్ యాక్టు కేసు, ఆర్బీఐ యాక్టు కేసు నమోదు చేశారు. తాజాగా గురువారం నిర్వహకుల్లో ప్రధాన నిందితుడు అయిన గంగిశెట్టి శ్రీనివాసులును అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. అనంతరం జ్యూడీషీయల్ రిమాండుకు తరలించినట్లు సీఐ రాజేందర్ రెడ్డి తెలిపారు.


