క్రికెటర్గా కల్పన అదరగొట్టాలి
– రాష్ట్ర జట్టుకు ఎంపిక అభినందనీయం
– సన్మానించిన తాండూరు క్రికెట్ జోన్ తల్లిదండ్రులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : అండర్-19 విభాగంలో రాష్ట్ర జట్టుకు ఎంపికైన క్రికెట్ క్రీడాకారిణి కల్పన తన ప్రతిభతో అదరగొట్టి అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని తాండూరు క్రికెట్ జోన్ క్రీడాకారుల తల్లిదండ్రులు అన్నారు. తాండూరు పట్టణానికి చెందిన కల్పనను బీసీసీఐ అండర్ 19 విభాగంలో మహిళల టీ-20 జట్టుకు ఇటీవలే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ద్వారా స్టాండ్ బై ప్లేయర్ గా ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఈనెలలో చెన్నైలో జరిగే అండర్-19 టీ-20 టోర్నమెంట్లో కల్పన పాల్గొనబోతోంది. ఇందులో భాగంగా మంగళవారం తాండూరు క్రికెట్ జోన్కు సంబంధించి క్రికెట్ క్రీడాకారుల తల్లిదండ్రులు రాష్ట్ర జట్టుకు ఎంపికైన కల్పనను ఘనంగా సన్మానించారు. టోర్నమెంట్లో పాల్గొంటున్న సందర్భంగా ఆమెకు క్రీడా సామాగ్రిని బహుకరించారు. అనంతరం పలువురు మాట్లాడుతూ కల్పన అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కల్పన తల్లిదండ్రులపాటు క్రికెట్ క్రీడాకారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

