ఆర్టీసీ ఎండిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన స‌జ్జ‌నార్

తెలంగాణ హైదరాబాద్

ఆర్టీసీ ఎండిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన స‌జ్జ‌నార్
ద‌ర్శిని ప్ర‌తినిధి: టీఎస్ఆర్టీసీ ఎండీగా సీనీయ‌ర్ ఐపీఎస్ స‌జ్జ‌నార్ శుక్ర‌వారం బాధ్యతలు చేపట్టారు. వేదపండితులు ఆశీర్వచనాల మ‌ద్య ఆయ‌న ఎండీగా బాధ్య‌త‌లు స్వీక‌రిస్తూ సంత‌కం చేశారు. సైబరాబాద్ పోలీస్ కమీషనర్‌గా సేవలందించిన సజ్జనార్‌ను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ఎండీగా బదిలీ చేసిన విష‌యం తెలిసిందే. సజ్జనార్‌ అంతకుముందు సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌గా పని చేశారు. మూడేళ్ల పాటు సైబరాబాద్‌ సీపీగా పని చేసి నేరాల కట్టడికి కఠిన చర్యలు తీసుకున్నారు. 2009లో దేశంలోనే సంచలనం సృష్టించిన ‘దిశ’ కేసులో సజ్జనార్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సజ్జనార్‌ గతంలో సీఐడీ, ఇంటిలిజెన్స్‌ విభాగాల్లో కూడా పని చేశారు. ఇప్పటివరకు ఐపీఎస్‌గా తన బాధ్యతలు నిర్వహించిన సజ్జనార్ మరో రోల్ పోషించేందుకు సిద్దమయ్యారు. ఆర్ధిక నష్టాలతో సతమతమవుతున్న ఆర్టీసీని.. లాభాల బాట పట్టించే ఛాలెంజింగ్ బాధ్యతలను సజ్జనార్ స్వీకరించారు. అనంత‌రం ఆయ‌న‌ ఆర్టీసీ ఉన్నతాధికారులతో కీలక భేటీ అయ్యారు. ఆర్టీసీలోని వేర్వేరు విషయాలపై చర్చించారు.