కళాశాలనే కంపు లేపుతారా..!
– మండిపడిన కళాశాల విద్యార్థులు
– కాలేజీ ముందు ఆందోళన
తాండూరు, దర్శిని ప్రతినిధి: చదువుకునే కళాశాలనే కంపు లేపుతారా అంటూ తాండూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు మండిపడ్డారు. సోమవారం పీడీఎస్ యూ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ కళాశాలకు రెండు రోజులు సెలవు రావడంతో గుర్తుతెలియని ఆకతాయిలు కళాశాలను దుర్గందం చేశారని అన్నారు. కళాశాలలోని తరగతి గదులలో మద్యం సేవించి.. మూత్ర విసర్జన చేసి కంపు లేపారని మండిపడ్డారు. కళాశాలలో ఆకతాయిల ఆగడాలు మితిమీరుతున్నాయని. వెంటనే దుశ్చర్యలకు పాల్పడే వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కళాశాల ప్రిన్సిపల్, పోలీసులు నచ్చజెప్పడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు.

