తాగునీటి తంటాలు తీర్చండి..!

తాండూరు రాజకీయం వికారాబాద్

తాగునీటి తంటాలు తీర్చండి..!
– పట్టణ సమస్యలను పరిష్కరించండి
– మున్సిపల్ అధికారులకు బీజేపీ విజ్ఞప్తి
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణ వాసులు తాగునీటికి తంటాలు పడుతున్నారని, పలు సమస్యలతో సతమతమవుతున్నారని బీజేపీ నేతలు మండిపడ్డారు. గురువారం బీజేపీ పట్టణ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్ ఆధ్వర్యంలో కౌన్సిలర్ సాహు శ్రీలతతో పాటు నేతలు మున్సిపల్ అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలో కొన్ని రోజుల నుంచి తాగునీటి కటకట నెలకొందని, దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మొత్తం 36 వార్డుల్లో ఇదే పరిస్థితి ఏర్పడిందని, ముఖ్యంగా 23, 24వ వార్డులలో మూడు నెలల నుంచి తాగునీరు రావడం లేదని ఆరోపించారు. మిషన్ భగీరథ నీటి సరఫరాకు ప్రత్యామ్నాయంగా అధికారులు చర్యలు చేపట్టక పోవడం శోచనీయమన్నారు. మరోవైపు పట్టణంలో దోమల బెడద అధికం కావడంతో మలేరియా, డెంగీ వంటి రోగాల బారిన పడుతున్నారని అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తాగునీటి తంటాలను తీర్చాలని, సమస్యలను పరిష్కరించేలా దృష్టి సారించాలని కోరారు. లేదంటే మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి బంటారం భద్రేశ్వర్, యువజనాయకులు అంతారం కిరణ్ తదితరులు ఉన్నారు.