మోడీ… ఈడీలకు భయపడేది లేదు

తాండూరు రాజకీయం వికారాబాద్

మోడీ… ఈడీలకు భయపడేది లేదు
– ఎమ్మెల్యేకు నోటీసులు జారీ ఊహించిందే
– ఫైలెట్ రోహిత్ రెడ్డిపై కేంద్రం కుట్ర
– జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజుగౌడ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : మోడీ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసే ఈడీ అధికారులకు భయపడేది లేదని వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్ అన్నారు. బెంగుళూరు డ్రగ్స్ కేసులో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి ఈనెల 19న విచారణకు హాజరుకావాలని శుక్రవారం ఈడీ నోటీసులు జారీ చేసింది. దీనిపై వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ రాజుగౌడ్ స్పందిస్తూ నోటీసులు జారీని ఖండించారు. ఎప్పుడో మరుగున పడిన కేసును ఈడీ తిరగతోడే ప్రయత్నం చేస్తుందన్నారు. కేంద్రం ఎమ్మెల్యేల కొనుగోలు కుట్రను భగ్నం చేయడంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కీలకంగా ఉండడాన్ని కేంద్రం జీర్ణించుకోలేక పోతుందని విమర్శించారు. ఈడీ నోటీసుల జారీని ముందే ఊహించిన పరిణామం అని అన్నారు. డ్రగ్స్ కేసులో రోహిత్ రెడ్డికి ప్రమేయం లేదని గతంలోనే తేలినా.. కేంద్రం కుట్రతో నోటీసులను జారీ చేసిందని అన్నారు. మోడీకి అనుకూలంగా పనిచేసే ఈడీ అధికారులకు భయపడేది లేదని అన్నారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి సర్కారు, ప్రజలు అండగా ఉంటారని అన్నారు.