పదితోనే పోస్టాఫీస్ జాబ్..!
– గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల భర్తికి దరఖాస్తులు
– తెలంగాణ, ఏపీలో ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే
దర్శిని డెస్క్: పదో తరగతి పాసైన నిరుద్యోగులకు గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్) శుభవార్త చెప్పింది. దేశవ్యాప్తంగా 40,889 పోస్టులను భర్తీ చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రకటన జారీ చేసింది. ఎవరు అర్హులో.. ఎలా దరఖాస్తు చేసుకోవాలో అనే విషయాలను కూడ వెల్లడించింది. రెండు తెలుగు రాష్ట్రాలు తెలంగాణలో 1266 ఖాళీలు, ఆంధ్రప్రదేశ్లో 2480 ఖాళీలు ఉన్నట్లు తెలిపింది. బ్రాంచ్ పోస్టు మాస్టర్ (బీపీఎం), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్ (ఏబీపీఎం), డాక్ సేవక్ హోదాలతో విధులు నిర్వహణకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. రూ. 12 వేల నుంచి పోస్టును బట్టి ప్రారంభ వేతనం ఉంటుందని. ఆసక్తి ఉన్నవారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
ఎంపిక
అభ్యర్థులు పదో తరగతిలో సాధించిన మార్కుల మెరిట్తో నియామకాలుంటాయి. ప్రకటలో ఖాళీలు ఉన్న బ్రాంచీలు, ఏ హోదాలో ఖాళీ ఉంది, రిజర్వ్డ్/ అన్ రిజర్వ్డ్ వివరాలు పేర్కొన్నారు. వాటిని అభ్యర్థులు పరిశీలించి, తమ ప్రాధాన్యం ప్రకారం ఆప్షన్లు ఇవ్వాలి. మొదటి ప్రాధాన్యం ఇస్తోన్నదానికి ఆప్షన్-1 తర్వాత దానికి ఆప్షన్-2…ఇలా నింపాలి. అవకాశాన్ని బట్టి వీటిలో ఏదో ఒకచోట పోస్టింగ్ కేటాయిస్తారు. ఎంపికైనవారికి సమాచారం ఎస్ఎంఎస్/ఈమెయిల్/పోస్టు ద్వారా అందుతుంది.
అర్హత: పదో తరగతి ఉత్తీర్ణత. ఇందులో మ్యాథ్స్, ఇంగ్లిష్, స్థానిక భాష ఉండటం తప్పనిసరి.
(అంటే ఏపీ, తెలంగాణలకు చెందినవారు తెలుగు సబ్జెక్టు పదో తరగతి వరకు చదివివుండాలి).
వయసు: ఫిబ్రవరి 16, 2023 నాటికి 18-40 ఏళ్ల మధ్యలో ఉండాలి.
(ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు వర్తిస్తుంది).
ఫీజు: మహిళలు, దివ్యాంగులు, ట్రాన్స్జెండర్లు, ఎస్సీ, ఎస్టీలు చెల్లించనవసరం లేదు. మిగిలిన అభ్యర్థులు రూ.వంద చెల్లించాలి.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: ఫిబ్రవరి 16
వెబ్సైట్: https://indiapostgdsonline.cept.gov.in/

