కమణీయం… వైభోగం..!
– శ్రీ పార్వతీ పరమేశ్వర కళ్యాణం
– భద్రేశ్వరాయంలో సందడి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని భావిగి భద్రేశ్వర స్వామి దేవాలయంలో ఆదివారం పార్వతి పరమేశ్వర కళ్యాణం వైభోగంగా జరిగింది. శివదీక్షా సేవా సమితి ఆద్వర్యంలో నిర్వహించిన ఈ కళ్యాణోత్సవానికి పట్టణ భక్తులు, శివ స్వాములు వందలాదిగా తరలివచ్చారు. ఈ సందర్భంగా శ్రీ మహాంతయ్య స్వామి ఆధ్వర్యంలో పూజారులు శివపార్వతులకు ఉదయం నుంచి అభిషేకం, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

శివపార్వతుల కళ్యాణంలో పార్వతీదేవి తరుపున పట్టణానికి చెందిన రాకేష్, శ్రావణి దంపతులు పాల్గొనగా… శివుని తరుపున పట్టణానికి చెందిన బొప్పే శ్రీహరి, శిరీష దంపతులు పాల్గొని కళ్యాణం జరిపించారు. ముందుగా శివపార్వతుల కళ్యాణ ఘట్టంలో నిర్వహించే కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం శివపార్వతులను పట్టణంలో ఊరేగింపు నిర్వహించారు. భద్రేశ్వర ఆలయానికి ఊరేగింపుగా వచ్చిన శివపార్వతులకు అంగరంగ వైభవంగా కళ్యాణం జరిపించారు. మధ్యాహ్నం సుముహూర్త సమయంలో వేద మంత్రోచ్చరణల మధ్య శివపార్వతుల కళ్యాణం కమణీయంగా జరిగింది. స్వామివార్ల కళ్యాణోత్సవం సందర్భంగా ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చి శివ పార్వతులను దరి మంచుకున్నారు. కళ్యాణోత్సవం సందర్భంగా శివ భక్తులు ఆలాపించిన భజన కీర్తనలు ఆకట్టుకున్నాయి

