గవర్నర్పై సుప్రీంకోర్టుకు వెళ్లిన తెలంగాణ సర్కార్
– పిటీషన్ దాఖలు చేసిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
– పిటిషన్ రేపు విచారణకు వచ్చే అవకాశం
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర గవర్నర్ తమిళిసైకి మద్య వివాదాలు ఉన్న సంగతి అందరికి తెలిసిందే. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. రాష్ట్ర గవర్నర్ తమిళిసై వ్యవహారంపై తెలంగాణ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్రంలో 10 బిల్లులను గవర్నర్ తమిళిసై ఆమోదించకపోవడంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసినట్లు స్పష్టమైంది. సెప్టెంబర్ నుంచి 7 బిల్లులు, గత నెల నుంచి 3 బిల్లులు పెండింగ్లో ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది. ఈ పిటిషన్లో ప్రతివాదిగా తమిళిసై సౌందర్ రాజన్ పేరును చేర్చారు. బిల్లులను గవర్నర్ ఆమోదించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది.

