కౌగిలింతలో కాల్పులు..!
– ఒకే బుల్లెట్కు భార్య, భర్తలు ఔట్
– భర్త పేల్చిన తూటాకు ఇద్దరు బలి
దర్శిని డెస్క్: భార్యను కౌగిలించుకుని భర్త పేల్చిన తూటాకు ఇద్దరు బలి అయిపోయారు. ఒకే బుల్లెట్ ఇద్దరి ప్రాణాలను తీసింది. ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్ బిలారీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. యూపీ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మొరాదాబాద్లోని ఖాన్పూర్ గ్రామానికి చెందిన అనేక్ పాల్ అనే వ్యక్తి రోజువారీ కూలీగా పనిచేస్తున్నాడు. ఇతనికి భార్య సుమన్, నలుగురు పిల్లలు ఉన్నారు. ఒక వారం క్రితం, అనేక్ సింగ్ తన కోడలు ప్రీతి వివాహానికి హాజరయ్యేందుకు చండీగఢ్ నుండి తన కుటుంబంతో సంభాల్ జిల్లా ఖేడా గ్రామానికి వచ్చాడు. అక్కడ అతని మొబైల్ కనిపించలేదు. ఈ విషయమై భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. అత్తమామలు అనేక్ సింగ్ కు పాత మొబైల్ ఇచ్చారు. ఆ తర్వాత ఇద్దరూ ఖాన్పూర్కు వచ్చారు.
అయినా కూడా ఇదే విషయంలో అనేక్ పాల్ తరచూ భార్యతో గొడవపడేవాడు. మంగళవారం ఇంట్లో పూజ ముగిసిన తర్వాత.. మరోసారి ఫోన్ గురించి అనేక్ పాల్ భార్యతో గొడవపడ్డాడు. ఈ క్రమంలో సహనం కోల్పోయిన అనేక్ పాల్.. తన భార్యను గట్టిగా కౌగలించుకుని.. తన వద్ద ఉన్న నాటు తుపాకీతో ఆమె వీపుపై కాల్చాడు. అయితే, ఆమె ఛాతీ నుంచి బయటకు దూసుకొచ్చిన బుల్లెట్ అనేక్ పాల్కు తగలడంతో ఇద్దరూ అక్కడిక్కడే మరణించారు. కాల్పుల శబ్దం విని అనేక్ పాల్ ఇంట్లోకి వచ్చిన స్థానికులు భారాభర్తలిద్దరినీ ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే వారు మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నలుగురు పిల్లలను సంరక్షణాలయానికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.
ఇది కూడా చదవండి…


