పారిశుద్ధ్యాన్ని మెరుగు పరచండి
– ప్రజావాణిలో కౌన్సిలర్ బోయరవి ఫిర్యాదు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ పరిధి వార్డు నెంబర్ 6లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని ఆ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ బోయరవి కోరారు. సోమవారం తాండూరు మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన అధికారులకు ఫిర్యాదు చేశారు. వార్డు నెంబర్ 6లో పారిశుద్ధ్య వ్యవస్థ అస్తవస్త్యంగా మారిందని, దోమల బెడద అధికంగా ఉందన్నారు. దీంతో వార్డు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అదేవిధంగా మిషన్ భగీరథ వ్యవస్థలో సమస్యలు ఉన్నాయని అన్నారు. నల్లా కనెక్షన్లు, తాగునీటి అంతరాయం ఇబ్బందులను పరిష్కరించాలని ఫిర్యాదులో కోరారు. సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారని కౌన్సిలర్ బోయరవి తెలిపారు. మరోవైపు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రజల సమస్యలను పరిష్కరించాలని ప్రజావాణి నిర్వహించడంపై హర్షం వ్యక్తం చేశారు.

