డబుల్ అర్హుల వేట..!
– రేపటి నుంచి డబుల్ దరఖాస్తుల విచారణ
– ప్రత్యేక బృందాలతో ఇంటింటి దర్యాప్తు
– అదేశాలు జారీ చేసిన అడిషనల్ కలెక్టర్
తాండూరు, దర్శిని ప్రతినిధి: వికారాబాద్ జిల్లాలో పేదల కోసం ప్రభుత్వం మంజూరు చేసిన డబుల్ బెడ్ రూం ఇండ్ల పంపిణీలో అధికారులు అర్హుల వేటకు సిద్దమయ్యారు. పేదలకు డబుల్ బెడ్ రూం పంపిణీ చేయడంలో భాగంగా జిల్లాలోని తాండూరు, పరిగి మున్సిపాల్టీలలో గత సోమవారం నుంచి దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. శనివారంతో గడువు ముగిసింది. తాండూర్ మున్సిపల్ పరిధిలో 9436, పరిగి మున్సిపల్ పరిధిలో 1151 దరఖాస్తులను స్వీకరించడం జరిగింది. అయితే అదివారం వికారాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ రాహుల్ శర్మ వికారాబాద్, తాండూరు ఆర్డివోలు, మున్సిపల్ కమిషనర్లతో డబల్ బెడ్ రూమ్ దరఖాస్తుల వెరిఫికేషన్ పై టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాండూర్ మున్సిపల్ పరిధిలో 9436, పరిగి మున్సిపల్ పరిధిలో 1151 దరఖాస్తులను స్వీకరించడం జరిగిందని తెలిపారు. వచ్చిన దరఖాస్తుల వెరిఫికేషన్ కోసం రెవెన్యూ, మున్సిపల్ సిబ్బందితో టీంలను ఏర్పాటు చేయాలని అన్నారు. లబ్దిదారులు చేసుకున్న దరఖాస్తులు, వారి వివరాలను వారి ఇంటింటికి వెళ్లి సమగ్ర విచారణ చేపట్టాలన్నారు. విచారణలో అర్హులైన లబ్దిదారులను గుర్తించాలని ఆదేశించారు.

