భద్రేశ్వురుని వైభోగానికి వేళాయే..!

తాండూరు రాజకీయం వికారాబాద్

భద్రేశ్వురుని వైభోగానికి వేళాయే..!
– రేపటి నుంచే జాతర ఉత్సవాలు ప్రారంభం
– 15న రథోత్సవం, 16న లంకాదహనం
– ఇంకా ప్రత్యేకతలు ఏమున్నాయంటే..?
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నడిబొడ్డుకు నడిచొచ్చిన దైవం భావిగి భద్రేశ్వరుడు. ఆ భద్రేశ్వరుని జాతర వైభోగానికి వేళ అయ్యింది. భావిగి భద్రేశ్వరున్ని దర్శించుకుని తరించేందుకు భక్తులు సిద్ధమయ్యారు. రేపటి నుంచి భద్రేశ్వర జాతర ఉత్సవాలు అట్టహాసంగా ప్రారంభం కానున్నాయి. ప్రతి యేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడ జాతర ఉత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రేపటి నుంచి ఈనెల 19వ తేది వరకు జాతర ఉత్సవాలను నిర్వహించనున్నారు. జాతర ఉత్సవాలలో ప్రధాన ఘట్టాలు అయిన రథోత్సవం 15వ తేదిన, లంకాదహనం 16వ తేదీన నిర్వహించనున్నారు.

అంతేకాకుండా లంకాదహనం రోజు నుంచి జాతర ఉత్సవాలలో ఆకర్షణగా నిలిచే పశుప్రదర్శన కూడ నిర్వహిస్తున్నారు. ఇందుకు పట్టణంలోని శిశుమందిర్ పాఠశాలలో ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో పాటు జాతర ఉత్సవాల సందర్భంగా నేటి నుంచి 16వ తేది వరకు దేవాలయంలో నిత్యన్నధాన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈఓ శేఖర్ గౌడ్ మాట్లాడుతూ ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడ జాతర ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. మున్సిపల్, పోలీసు, రెవెన్యూ, ఫైర్, వైద్య శాఖతో పాటు పలు శాఖల ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేయడం జరుగుతుందన్నారు. జాతర ఉత్సవాలలో భక్తులు తరలివచ్చి భద్రేశ్వరున్ని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని విజ్ఞప్తి చేశారు.