గ్యాస్ సిలిండర్ లీకేజీ..!
– ఎగిసిన పడిన మంటలు
– అప్రమత్తతో తప్పిన ప్రమాదం
– అంతారం గ్రామంలో ఘటన
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి: గ్యాస్ సిలిండర్ లీకేజీతో అగ్ని ప్రమాదం సంభవించి ఆస్తి నష్టం జరిగింది. స్థానికుల అప్రమత్తతతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా తాండూరు మండలం అంతారం గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మడుగుల పెంటప్ప, పూలమ్మ దంపతులు తమ నివాసంలో చిన్న హోటల్ నడుపుతున్నారు. గురువారం ఉదయం హోటల్లో ఉన్న గ్యాస్ సిలిండర్ లీకేజీ అయ్యింది. ఒక్కసారిగా మంటలు ఎగిసి పడి అంతా వ్యాపించాయి. అక్కడున్న కొందరు పరుగులు తీశారు. మంటలు మరింతగా వ్యాప్తి చెందడాన్ని గమనించి వెంటనే నీళ్లు చల్లి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు.
విషయాన్ని తాండూరు అగ్నిమాపక శాఖ అధికారులకు తెలపడంతో సమాచారం అందుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే స్థానికులను నీళ్లు చల్లి మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. అగ్నిమాపక అధికారులు కూడ మంటలను పూర్తిగా అదుపుచేశారు. ఈ అగ్ని ప్రమాదంతో ఇళ్లు దగ్దం కావడంతో పాటు రూ. 65 వేల నగదు కాలి బూడిదైనట్లు బాధితులు తెలిపారు. ఇంట్లో ఉన్న వస్తువులు, ఆధార్ కార్డులు, రేషన్ కార్డు, విలువైన పత్రాలు కాలి పోవడంతో మొత్తంగా రూ. 2 లక్షల వరకు ఆస్తినష్టం జరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు అగ్ని ప్రమాదంతో నష్టపోయిన హోటల్ యమానిని గ్రామ సర్పంచ్ రాములు, ఎంపీటీసీ శాంతులు పరామర్శించారు. ప్రభుత్వం పరిహారం అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. మరోవైపు తాండూరు అగ్నిమాపక శాఖ అధికారులు గ్రామస్తులకు అగ్ని ప్రమాదాల నియంత్రణపై అవగాహన కల్పించారు.

