ట్రావెల్ టైం పెంచిన ఆర్టీసీ..!
– టీ-9 టిక్కెట్టు రవాణాలో మార్పులు
– ఎక్స్ప్రెస్ బస్సుల్లో ప్రయాణించేందుకు అవకాశం
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : గ్రామీణ ప్రాంతాలకు టీ-9 టిక్కెట్టు సేవలను విస్తరించిన ఆర్టీసీ సంస్థ మరో నిర్ణయం తీసుకుంది. 60 కిమీ పరిధిలో రానుపోను ప్రయాణించడానికి టి-9 టికెట్ను ఆర్టీసీ జూన్ 18 నుంచి ప్రవేశపెట్టింది. పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణించే మహిళలు, వృద్ధుల కోసం ప్రవేశపెట్టిన టీ-9 టికెట్ ప్రయాణ సమయాన్ని పెంచింది. గతంలో ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకే చెల్లుబాటు గడువు ఉండేది. తాజాగా ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు పెంచేందుకు సంస్థ నిర్ణయించింది. అదేవిధంగా రూ.100 చెల్లించి తీసుకునే ఈ టికెట్ పై అదనంగా మరో రూ.20 చెల్లిస్తే ఎక్స్ప్రెస్ బస్సుల్లోనూ ప్రయాణించడానికి వెసులుబాటు కల్పిస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఎక్స్ప్రెస్లలో తిరుగుప్రయాణంలో మాత్రమే కాంబినేషన్ టికెట్ వర్తిస్తుందని స్పష్టంచేసింది. ఈ నిర్ణయాలు ఈనెల 9వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. టీ-9 టికెట్ను మహిళలు, వృద్ధులు కొనుగోలు చేసి ఆర్టీసీ బస్సుల్లో సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సంస్థ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్, ఎండీ వీసీ సజ్జనర్ విజ్ఞప్తిచేశారు. ఈ టికెట్ల కోసం మరిన్ని వివరాలకు ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించాలని సూచించారు.
ఇది కూడా చదవండి…


