ప్రగతి ప్రణాళికలతో వార్డు అభివృద్ధి
– వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు
– 9వ వార్డులో జోరుగా పట్టణ ప్రగతి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పట్టణ ప్రగతి ద్వారా ప్రణాళికలు రూపొందించి వార్డు అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు పేర్కొన్నారు. 4వ విడత పట్టణ ప్రగతిలో భాగంగా సోమవారం చైర్ వైస్ చైర్ పర్సన్ దీపా నర్సింలు తన వార్డు నెంబర్ 9లో జోరుగా కార్యక్రమాలను చేపట్టారు. ఖాళీ ప్రదేశాలను శుభ్రం చేయించారు. అనంతరం దీపా నర్సింలు వార్డులో పర్యటిస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
వార్డులో నెలకొన్న సమస్యలను పట్టణ ప్రగతి ద్వారా గుర్తించి వాటి పరిష్కారానికి ప్రణాళికలు సిద్ధం చేయిస్తామన్నారు. దశల వారిగా వార్డులో సమస్యలను పరిష్కరించి పట్టణ ప్రగతిని మెరిపిస్తామన్నారు. అదేవిధంగా ప్రజలు పరిసరాల పరిశుభ్రతను పాటించాలని సూచించారు. తడి చెత్త, పొడి చెత్తను మున్సిపల్ వాహనాలకు అందించాలన్నారు. వచ్చే హరితహారంలో మొక్కలు నాటి సంరక్షించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఓ స్వప్న, స్పెషల్ ఆఫీసర్ రమేష్, ఆర్పీ, అంగన్వాడి టీఆచర్, ఆశ వర్కర్ తదితరులు పాల్గొన్నారు.



