ఎక్స్ట్రా పెరుగుకోసం పోయిన ప్రాణం
– బిర్యాని తినేందుకు వచ్చి హత్యకు గురైన వైనం
– హైదరాబాద్లో ఘటన
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: బిర్యానీ తినేందుకు వచ్చిన ఓ వినియోగ దారుడు ఎక్స్ ట్రా పెరుగు కోసం జరిగిన గొడవలో ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. పాతబస్తీ చాంద్రాయణగుట్టకి చెందిన లియాకత్ అనే వ్యక్తి మెరిడియన్ హోటల్లో బిర్యానీ తినేందుకు వచ్చాడు. ఎక్స్ట్రా పెరుగు తీసుకురావాలని హోటల్ సిబ్బందిని అడగడంతో గొడవ మొదలైంది. దీంతో లియాకత్పై సిబ్బంది విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పంజాగుట్ట పోలీసులు, లియాకత్తో పాటు మెరిడియన్ హోటల్ సిబ్బందిని కూడా పోలీస్స్టేషన్కు తరలించారు.
పోలీస్ స్టేషన్లో మాట్లాడుతుండగానే లియాకత్ స్పృహకోల్పోయాడు. వెంటనే పోలీసులు అతన్ని స్థానికంగా ఉన్న డెక్కన్ ఆస్పత్రికి తరలించారు. చికిత్సపొందుతూ లియాకత్ మృతి చెందాడు. దీంతో పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. విషయం తెలుసుకున్న మృతుడి బంధువులు డెక్కన్ హాస్పిటల్ దగ్గరికి చేరుకుని ఆందోళనకు దిగారు. దాడి జరిగిన వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లకుండా పోలీస్స్టేషన్కు తీసుకెళ్లడంతోనే లియాకత్ మృతి చెందాడని అతని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంజాగుట్ట పోలీస్స్టేషన్కు ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రెహమత్బేగ్ చేరుకుని పోలీసులతో మాట్లాడారు. బాధితుడి కుటుంబానికి న్యాయం చేయాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మెరిడియన్ హోటల్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు.
ఇది కూడా చదవండి..

