వెల్లివిరిసిన మత సామరస్యం
– శివస్వాములను సన్మానించిన ముస్లిం సోదరుడు
– అభినందించిన స్వాములు, నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో మతసామరస్యం వెల్లి విరిసింది. శ్రీశైలంకు బయల్దేరిన శివస్వాములను ఓ ముస్లిం సోదరుడు సన్మానించి హిందూ, ముస్లింల ఐక్యతను చాటాడు. ఈ సంఘటన శనివారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. పెద్దేముల్ మండలం హన్మాపూర్ గ్రామానికి చెందిన లొంక నర్సింలు, పరిసర ప్రాంతాలకు చెందిన దాదాపు 150 మంది శివ మాల ధరిస్తున్నారు. ప్రతి యేడాది శివరాత్రి సందర్భంగా వీరు దీక్షలో శ్రీశైలంకు బయల్దేరి వెళ్తారు. వాళ్లకు తాండూరుకు చెందిన ప్రముఖ వ్యాపారి రహీం తనవంతు తోడ్పాటు అందించే ఆనవాయితీని పాటిస్తున్నారు.
ఈసారి కూడా శనివారం లొంక నర్సింలు ఆధ్వర్యంలో శ్రీశైలంకు బయల్దే రిస శివస్వాములకు రహీం ఘనంగా సన్మానించారు. అంతేకాకుండా శివస్వాములకు ఆహారం, తాగునీటి బాటిళ్లను కూడా పంపిణీ చేశారు. దీంతో తాండూరులో మత సామరస్యం వెల్లివిరిసింది. ఈ సందర్భంగా పలువురు ముస్లిం సోదరుడు అందించిన సాయాన్ని కొనియాడారు. హిందూ, ముస్లిం సోదరులు అన్నదమ్ముల్లా ఉండి ఐక్యతను చాటుకోవడానికి ఇదే నిదర్శమని, రహీంను అభినందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బంటు వేణుగోపాల్, బాతుల నాగేష్, తలారి గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..

