వడ్డీ డబ్బుల కోసం దాష్టీకం
– బాధితున్ని చితకబాదిన వైనం
– సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్
– కేసు నమోదు చేసిన పోలీసులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తీసుకున్న డబ్బులకు వడ్డీ చెల్లించలేని ఓ వ్యక్తి దాష్టికానికి పాల్పడ్డాడు. చేతులు కట్టి తన్నడమే కాకుండా పిడిగుద్దులు గుద్దాడు. పైగా కుటుంబ సభ్యులతో వీడియో తీయించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే… తాండూరు పట్టణం రాజీవ్ కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ బాలయ్య తాండూరు పట్టణం గాంధీనగర్ కు చెందిన మ్యాదరి రవి అనే వ్యక్తి వద్ద మూడు నెలల క్రితం రూ.5వేలు అప్పు తీసుకున్నాడు. దీనికి నెలకు రూ.500ల వడ్డీ కావడంతో మూడు నెలలకు రూ.6,500లు అయ్యింది.
తీసుకున్న డబ్బు, వడ్డీ ఇవ్వడం లేదని శుక్రవారం రవి బాలయ్యను ఇంటికి తీసుకవచ్చి చితక బాదాడు. ఈ దాడిని వీడియో తీయించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అనంతరం బాధితుడు పట్టణ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ సంతోష్ కుమార్ తెలిపారు.
ఇదికూడా చదవండి…

