బస్సు ఆపలేదని గుస్సా..!
– బీరు బాటిల్తో అద్దం ధ్వంసం
– కండక్టర్పై పాము విసిరిసిన వృద్ధురాలు
– సోషల్ మీడియాలో సంఘటన వైరల్
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : చేయి ఎత్తిన చోట బస్సు ఆపలేదని ఓ 65 ఏండ్ల వృద్దురాలు గుస్సా చేసింది. ఆపలేని బస్సుపై బీరు బాటిల్తో దాడిచేయడంతో పాటు పట్టుకునేందుకు వచ్చిన మహిళ కండక్టర్పైకి వెంట తెచ్చుకున్న పామును పారేసింది. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్లోని దిల్సుఖ్ నగర్కు చెందిన ఆర్టీసీ బస్సు 107 V/L బస్సు సికింద్రాబాద్ నుంచి గురువారం సాయంత్రం ఎల్బీనగర్ వైపు వెళుతుంది. విద్యానగర్ బస్టాఫ్ తర్వాత సిగ్నల్ ఫ్రీ లెఫ్ట్ వద్ద బస్సు తిరుగుతున్నప్పుడు నగరంలోని దమ్మాయిగూడకు చెందిన బేగం అలియాస్ ఫాతిమా బీబీ అలియాస్ అసీం (65) సదరు మహిళ బస్సు ఆపేందుకు ప్రయత్నించింది. అయితే అది మూలమలుపు కావటం, రద్దీగా ఉన్న కారణంగా డ్రైవర్ అక్కడ బస్సు ఆపలేదు.
దీంతో ఆగ్రహించిన మహిళ తన వద్ద ఉన్న ఖాళీ బీరు సీసాను బస్సుపైకి విసిరింది. దీంతో బస్సు వెనుక అద్దం పగిలిపోయింది. గమనించిన డ్రైవర్ వెంటనే బస్సును ఆపాగా.. అదే బస్సులో విధులు నిర్వహిస్తోన్న మహిళా కండక్టర్ స్వప్న కిందకు దిగి ఆమెను పారిపోకుండా గట్టిగా పట్టుకుంది. వదిలించుకోవాలని ఆమె ప్రయత్నించినా సాధ్యపడలేదు. దీంతో బేగం తన వద్ద ఉన్న సంచిలో పాము ఉందంటూ కండక్టర్ను బెదిరించింది. అయినా కండక్టర్ స్వన్న బెదరకపోవడంతో.. సంచిలో ఉన్న నాలుగు అడుగుల పొడవున్న పామును (జెర్రిపోతు) బయటికి తీసి కండక్టర్పైకి విసిరింది. అది స్వప్న ఒంటిమీద పడి నేలపైకి జారిపోయింది.
సదరు మహిళ ఊహించని చర్యకు ప్రయాణికులు, స్థానికులు భయంతో పరుగులు తీశారు. హైదరాబాద్ కమిషనరేట్ నల్లకుంట పీఎస్లో ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని బేగంను అదుపులోకి తీసుకున్నారు. పాము కోసం వెతికినా దొరకలేదు. ఆమె మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు. ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేరవేస్తోన్న బస్సులపై దాడులు చేయడం, నిబద్దత, అకింతభావంతో విధులు నిర్వర్తిస్తోన్న సిబ్బందిని కొందరు ఇలా భయభ్రాంతులకు గురిచేయడం దురదృష్టకరం.
ఈ తరహా ఘటనలను టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఏమాత్రం ఉపేక్షించదు. పోలీస్ శాఖ సహకారంతో బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు.
ఇదికూడా చదవండి…

