తల దువ్వినందుకు గుండు కొట్టించాడు..!

క్రైం తెలంగాణ మహబూబ్ నగర్ హైదరాబాద్

తల దువ్వినందుకు గుండు కొట్టించాడు..!
– ఆహంతో ఎస్ఐ చేసిన నిర్వహాకం
– పోలీసు శాఖలో చర్చనీయాంశం
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తన ముందే తల దువ్వుకున్నాడని ఓ ఎస్ఐ ఈగోకు పోయి.. యువకులకు గుండు కొట్టించాడు. అందులో ఓ యువకుడు అవమాన భారంగా భావించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ అమానుష సంఘటన నాగర్‌కర్నూల్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే… నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండల కేంద్రంలోని ఓ పెట్రోల్ బంకులో పెట్రోల్ విషయంలో యువకులు, సిబ్బంది మధ్య గొడవ జరిగింది. పెట్రోల్ బంక్ నిర్వాహకుల ఫిర్యాదు మేరకు యువకులను పీఎస్‌కు తరలించారు.

ముగ్గురు యువకుల్లో ఒకడు ఎస్సై జగన్‌ ముందు నిల్చోని తల దువ్వడంతో ఆగ్రహంతో రగిలిపోయాడు. దీంతో ముగ్గురు యువకులకు శిరోముండనం చేయించాడు. ఈ ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ యువకుడు మరుసటి రోజు మనస్తాపంతో సదరు యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అతన్ని గమనించిన కుటుంబసభ్యులు, స్థానికుల సాయంతో హుటాహుటీన నాగర్ కర్నూల్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం నాగర్‌కర్నూల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతన్న యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, ఈ ఘటనపై పోలీస్ ఉన్నతాధికారులు ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఈగో వల్ల ఎంతపనికి సిద్దపడతారా అంటూ పలువురు ఎస్ఐ తీరును విమర్శిస్తున్నారు.

ఇదికూడా చదవండి…

నల్ల మిరియాలతో లాభాలెన్నో…!